Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిల్లర్లు కొర్రీలు పెడితే ఊరుకునేది లేదు
- గన్నీ సంచులు, లారీల కొరత లేకుండా చూడాలని..
- అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాలు
నవతెలంగాణ-నిజామాబాద్సిటీ/నందిపేట్
వ్యవసాయ అధికారులు ధాన్యానికి ఎఫ్ఏక్యూ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత కూడా మిల్లర్లు కడ్తా తీస్తే ఆ మిల్లును సీజ్ చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి సెల్ కాన్ఫరెన్స్ ద్వారా ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో మాట్లాడి పలు ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు నందిపేట్తో పాటు మండలంలోని మల్లారం, ఐలాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. పరిస్థితిని పరిశీలించిన అనంతరం ఆయన గమనించిన విషయాలను అధికారులకు తెలిపారు. నందిపేట్, నవీపేట్, మాక్లూర్ తదితర మండలాల నుంచి ధాన్యం ఎక్కువగా రానుందనీ, అందుకు సరిపోయే విధంగా పెద్ద మొత్తంలో గన్నీ బ్యాగులు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని తప్పకుండా వ్యవసాయ అధికారులు పరిశీలించి ఎఫ్ఏక్యూ ఉన్న ధాన్యానికి ధ్రువీకరణ పత్రం జారీ చేయాలనీ, ఆ తర్వాతనే ధాన్యాన్ని తూకం వేసి రైస్ మిల్లులకు పంపించాలని ఆదేశించారు. ధ్రువీకరణ లేకుండా ఎట్టి పరిస్థితిల్లో మిల్లులకు ధాన్యాన్ని పంపవద్దని స్పష్టం చేశారు. వ్యవసాయ అధికారులు నాణ్యమైన ధాన్యానికి ధ్రువీకరణ చేసిన తర్వాత కూడా మిల్లర్లు కడ్తా తీస్తామంటే ఆ మిల్లులను సీజ్ చేయాలని ఆదేశించారు. 90 శాతం పైగా రైతులు పూర్తి స్థాయిలో నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువస్తున్నట్టు తన పర్యటనలో గమనించినట్టు చెప్పారు.
అయినా కూడా మిల్లర్లు కొర్రీలు పెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. లారీల కాంట్రాక్టర్లు ఒక్కొక్కరు 150 లారీలు పంపించాలనీ, వాటిని అదనపు కలెక్టర్, ఆర్డీవోలు, తహసీల్దార్ పర్యవేక్షణ చేస్తూ రైస్ మిల్లులకు చేరవేస్తూ రవాణాలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలు రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలు, రైతులకు సంబంధించిన ఆధార్, బ్యాంక్ ఖాతా తదితర వివరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలనీ, తద్వారా రైతులకు వీలైనంత త్వరగా ధాన్యం డబ్బులు చెల్లించడానికి వీలవుతుందని సూచించారు. కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీసీవో సింహాచలం, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, ఆర్డీవోలు రాజేశ్వర్, శ్రీనివాస్, రవి, పౌరసరఫరాల అధికారులు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.