Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఉపాధి' పనుల్లో మట్టి పెళ్లలు మీదపడి
- ప్రమాదకరమైన ప్రాంతాల్లో పనులు..
- అధికారుల పర్యవేక్షణ కరువు..
- అందుబాటులో లేని ప్రథమ చికిత్స బాక్స్
నవతెలంగాణ-అక్కన్నపేట
పొట్టకూటి కోసం ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళా కూలీ.. పనులు చేస్తుండగా మట్టిపెళ్లలు మీదపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం సోమాజీ తాండాలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమాజీ తాండాకు చెందిన భూక్య లావణ్య(28) ఉపాధి హామీ పనుల్లో భాగంగా తోటికూలీలతో కలిసి చెరువు కట్ట సమీపంలో పనులు చేస్తున్నది. ఈ క్రమంలో ఒక్కసారిగా మట్టిపెళ్లలు కూలాయి. కూలీలందరూ భయంతో పరుగులు తీశారు. కానీ లావణ్య ఆ మట్టిపెళ్లల కిందనే ఇరుక్కుపోయింది. గమనించిన స్థానికులు ఆమెను బయటికి తీయగా.. అప్పటికే మృతి చెందింది. మృతురాలికి ఐదేండ్లలోపు ఉన్న ఇద్దరు పిల్లలున్నారు. కాగా ప్రమాదకర ప్రాంతాల్లో 'ఉపాధి' పనులు చేయిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. పై అధికారుల పర్యవేక్షణ మొత్తమే లేకుండా పోయిందన్నారు.