Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'డ్రగ్స్ తరహాలో వరిని ఏమైనా సర్కారు నిషేధించిందా?కలెక్టర్ ఏమనుకుంటున్నారు. కోర్టు ఆర్డరున్నా లెక్క చేయబోమని ఎలా చెబుతారు? కోర్టుధిక్కారమవుతుందని ఆ కలెక్టర్కు తెలి యదా? వరి సాగు చేయవద్దని ఆయనెలా చెబుతారు? నిషేధం లేనప్పుడు వరి విత్తనాల్ని అమ్మితే తప్పేమిటి?కలెక్టర్ ప్రకటన కోర్టు ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే కదా?' అంటూ సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గత నెల 26న రైతులు, విత్తన డీలర్లతో మీటింగ్ పెట్టి వరి విత్తనాలు అమ్మితే ఉపేక్షించబోమని ఎలా హెచ్చరిస్తారని ప్రశ్నించింది. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నా వరి విత్తనాలను అమ్మనీయబోమని, షాపుల్ని మూసేస్తామని కలెక్టర్ చెప్పడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఇది కచ్చితంగా కోర్టు ధిక్కారమే అవుతుందని చెప్పింది. అయితే క్రిమినల్కోర్టు ధిక్కార వ్యవహారంపై తాను విచారణ చేయరాదనీ, అందుకు కలెక్టర్ వ్యాఖ్యలను సవాల్ చేసిన రిట్ను ప్రధాన న్యాయమూర్తికి నివేదించాలని రిజిస్ట్రీకి ఉత్తర్వులు ఇస్తున్నట్లు ప్రకటించింది. కలెక్టర్ చేసిన హెచ్చరికలను సవాల్ చేస్తూ సిద్దిపేట మండలం ఇమాంబాద్ గ్రామ రైతు బి. నారాయణ సవాల్ చేసిన రిట్ను మంగళవారం జస్టిస్ వినోద్కుమార్ విచారణ జరిపారు. విచారణకు ఏజీ రావాలని ఆదేశించారు. మధ్యాహ్నం మళ్లీ విచారణ చేపట్టారు. వరిని సాగు చేయవద్దంటే ప్రాజెక్టులు కట్టడం ఎందుకని ప్రశ్నించింది. ప్రాజెక్టుల నిర్మాణాలకు భూసేకరణ చేయవద్దని ఆర్డర్ ఇవ్వాల్సివస్తుందని హెచ్చరించింది. కలెక్టర్ తన వాదన చెప్పుకునే అవకాశం ఇవ్వాలని ఏజీ బీఎస్ ప్రసాద్ కోరారు. వరి సాగు, వరి విత్తనాల అమ్మకాలపై నిషేధం ఏమీ లేదన్నారు. కలెక్టర్ తీరును తీవ్రంగా పరిగణించాలని పిటిషనర్ లాయర్ కోరారు.