Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలపైనా బాధ్యత ఉంది
- పీఐవోలకు శిక్షణ అవసరమే
- కార్యకర్తలను చంపేస్తున్నారు
- ఎస్వికె వెబినార్లో కేంద్ర సమాచార
- పూర్వ కమిషనర్ మాఢభూషి శ్రీధర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సమాచార హక్కు చట్టాన్ని పక్కాగా అమలుచేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని కేంద్ర సమాచార పూర్వ కమిషనర్, మహీంద్ర న్యాయ విశ్వవిద్యాలయం డీన్ ప్రొఫెసర్ మాఢభూషి శ్రీధర్ అన్నారు. ఈ చట్టాన్ని అమలుచేయించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనా ఉందని వ్యాఖ్యానించారు. చట్టాన్ని రక్షిస్తూ ప్రజలకు సేవలు అందించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇవ్వమని అడిగినందుకే దేశవ్యాప్తంగా 120 మంది కార్యకర్తలను అసాంఘీక శక్తులు చంపేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం(ఎస్వికె) ఆధ్వర్యంలో 'సమాచార హక్కును సర్కార్లు ఖూనీ చేస్తున్నాయా ? అనే అంశంపై వెబినార్ నిర్వహించారు. దీనికి ఎస్వికె మేనేజింగ్ ట్రస్ట్ కార్యదర్శి ఎస్.వినయకుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈసందర్భంగా మాఢభూషి శ్రీధర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు చట్టాన్ని గౌరవించాలనీ, సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ప్రధానంగా పీఐవోలకు శిక్షణ అవసరమని వ్యాఖ్యానించారు. చట్టంలో మంచితోపాటు చెడు కూడా ఉంటుందనీ, అధికారులు తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన రక్షణ ఏర్పాట్లు చేసుకుంటారని చెప్పారు. మంచి ఉద్దేశం పేరుతో సమాచారం ఇవ్వనిరాకరించడం సరికాదనీ, అలా చేసే అధికారులకే జరిమానా విధించవచ్చని అభిప్రాయడ్డారు. చట్టానికి ఇష్టానుసారం భాష్యాలు చెప్పరాదన్నారు. చట్టం ప్రకారం దరఖాస్తుదారులకు 30 రోజుల్లో కచ్చితంగా సమాచారం ఇవ్వాలనీ, ఇవ్వకపోతే అప్పీల్ చేసుకునే అవకాశం, అధికారం దరఖాస్తుదారులకు ఉంటుందని గుర్తు చేశారు. ప్రభుత్వాలు ప్రజలకు తెలిసేలా జీవోలు, సర్క్యులర్లు పబ్లిక్ డొమైన్లో పెట్టాలనీ, దాచే ప్రయత్నం చేయరాదన్నారు. అలా చేస్తేనే సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. చట్టంలోని కొన్ని సెక్షన్లను అడ్డుపెట్టుకుని సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని అన్నారు. రహస్య సమాచారం కూడా పరిమితుల మేరకు ఇవ్వొచ్చని చెప్పారు .నిఘా సంస్థల సమాచారం అందరికి ఇవ్వాల్సిన అవసరం లేదని చట్టమే చెబుతున్నదనీ, అక్కడ పేచీ లేదన్నారు. రికార్డులను సక్రమంగా నిర్వహిస్తేనే సమాచారం ఇవ్వడానికి సులభంగా ఉంటుందని చెప్పారు. అలా చేయకుండా సమాచారం లేదు అని చెప్పడం సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమేనని అభిప్రాయపడ్డారు. తప్పు, నేరం వేర్వేరనీ, తప్పు చేసిన అధికారులను జైలుకు పంపడం అన్యాయమనీ, అంతపెద్ద శిక్షలు వేయరాదని చెప్పారు. నేరం చేసిన వారు ఎవరైనా సరే శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో జీవోలు, సర్క్యులర్లు ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారనీ, వెబ్సైట్లో పెట్టలేదనే ఫిర్యాదులు గతంలోనే ఉన్నాయన్నారు. వీటిపై హైకోర్టుల్లో విచారణ జరిగి, ఉత్తర్వులు జారీ చేసిన 24 గంటల్లో ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చాయని గుర్తు చేశారు. సమాచారం అడిగిన కార్యకర్తలపై భయంకరంగా దాడులు చేసి చంపేస్తున్నారనీ, దీన్ని సహించరాదన్నారు. సమాచార హక్కు చట్టం అమలుకు కేంద్రంలో డీవోపీటీ, రాష్ట్రంలో సమాచారం శాఖ నోడల్ కేంద్రాలుగా ఉన్నాయని చెప్పారు. నేరాలు చేసే ప్రజాప్రతినిధులను ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలకు విడుదలయ్యే నిధుల వివరాలను ఈ చట్టం కింద దరఖాస్తు చేసి సమాచారం తీసుకోవచ్చారు. రాజకీయ పార్టీలనూ సమాచారం అడగొచ్చని చెప్పారు. రామన్మెగాసెసే అవార్డు గ్రహిత, ప్రముఖ జర్నలిస్ట్ పాలగుమ్మి సాయినాథ్ సైతం సమాచార హక్కు చట్టంపై అనేక ప్రసంగాలు చేశారనీ, తానూ అనేక వ్యాసాలు రాశానని చెప్పారు. కేంద్ర సమాచార కమిషనర్గా పనిచేసే కాలంలో అనేక దరఖాస్తులను పరిష్కరించాననీ, సమాచారం ఇవ్వని అధికారులకు జరిమానాలు వేయడం, శిక్షలు విధించడం తదితర కఠిన చర్యలు చేపట్టానని తెలియజేశారు. చట్టంలో ప్రతి పదానికి, చర్యకు నిర్వచనాలు ఉండవనీ చెప్పారు. ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడం కుదరదని అన్నారు. రాజ్యాంగం కల్పించిందే స్వేచ్ఛ అని, చట్టం ద్వారా సమాచారం తెలుసుకునే స్వేచ్ఛ దేశ ప్రజలందరికీ ఉందన్నారు. చట్టాల ప్రయోజనాలను మట్టుబెట్టే ప్రయత్నాలను అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ యంత్రాంగం చాలా పెద్దదనీ, సమాచారం ఇవ్వకపోతే రూ. 20 వేల వరకూ జరిమానా విధించవచ్చని చెప్పారు. సమాచార హక్కు చట్టాన్ని అమలుచేయడానికి అవసరమైన నియామకాలు ఎప్పటికప్పుడు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.