Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మద్యం షాపుల పెంపునకు రంగం సిద్ధం
- కొత్త లైసెన్సుల జారీకి ప్రభుత్వం కసరత్తు
- బెల్ట్షాపుల కట్టడిలో చర్యలు శూన్యం
- ప్రొహిబిషన్ పదాన్ని మరచినట్టు ఎక్సైజ్ శాఖ తీరు
- త్వరలో టెండర్లకు నోటిఫికేషన్
నవ తెలంగాణ- మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
పైసా ఖర్చు లేకుండా కోట్లకు కోట్లు గడించే మార్గాలను వెతుక్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంటున్నది. లిక్కర్ బిజినెస్ను మరింత విస్తృతం చేస్తే ఆదాయానికి డోకా ఉండబోదన్న ఆలోచనతో ఉన్నషాపులకు అదనంగా గల్లీల్లోనూ కొత్త షాపులను తెరిచేందుకు సిద్ధమైతుంది. మరో వారం పది రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 200లకు పైగా కొత్త షాపులను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 200కి పైగా షాపులను తెరిచేందుకు లైసెన్స్లు జారీ చేయనున్నట్టు తెలుస్తున్నది. నిజానికి నెల రోజుల కిందటే ఈ పని చేయాలని భావించినా.. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో నిర్ణయాన్ని నెల రోజుల పాటు వాయిదా వేసుకున్నారు. గత టెండర్ కాలం ముగిసినా కరోనా సాకుతో అక్టోబర్ 31 తో ముగియాల్సిన షాపుల లైసెన్స్ కాలపరిమితిని నవంబర్ 31 వరకు పెంచిన ప్రభుత్వం.. త్వరలోనే టెండర్లకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమౌతున్నది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రస్తుతం 193 లిక్కర్ షాపులుండగా.. వాటిలో సంగారెడ్డి జిల్లాలో 85, సిద్దిపేట జిల్లాలో 70, మెదక్ జిల్లాలో 38 మద్యం షాపులు నడుస్తున్నాయి. 2019-21 కాలానికి మద్యం దుకాణాల నిర్వహణకు 2019 నవంబర్లో ఎక్సైజ్ శాఖ అధికారులు లైసెన్స్లు జారీచేశారు. అక్టోబర్ 31వ తేదీతోనే ఆ షాపుల లైసెన్సులు ముగియగా.. ప్రభుత్వం మరో నెలరోజులు గడువు పెంచింది. ఇక ఈసారి ఉమ్మడి జిల్లాలో కొత్తగా 20 షాపులు పెరిగే అవకాశాలున్నాయి. ఒక్కో జిల్లాలో కనీసం ఆరు కొత్త షాపులకు లైసెన్స్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నది. అదే జరిగితే 200లకు పైగా షాపులు ఉమ్మడి జిల్లాలో ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
అప్లికేషన్ ఫీజు రూ.3 లక్షలు చేసే యోచన
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ నుంచి సంవత్సరానికి రూ.9,000 కోట్ల ఆదాయం సమకూ రుతున్నది. 2015-2017 టెండర్ వేలంలో.. అప్లికేషన్ ఫీజు రూ.50,000 ఉండగా.. 2017-2019లో ఆ ఫీజును రూ.లక్ష చేశారు. 2019-2021కి రూ. 2 లక్షలు అప్లికేషన్ ఫీజు వసూలు చేయగా.. ప్రస్తుతం ఆ ఫీజును రూ.3లక్షలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. అప్లికేషన్ ఫీజులు పెంచుకుంటూ పోతే మా గతేంటంటున్న మద్యం షాపుల ఓనర్లు కూడా తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుంచుతున్నారు. ఫీజు ధర పెంచితే కమీషన్ను కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
బెల్ట్ షాపుల కట్టడిలో ఎక్సైజ్ శాఖ చర్యలు శూన్యం
లిక్కర్ షాపులను టెండర్ వేలం ద్వారా దక్కించుకున్న యాజమానులు లక్షలు ఖర్చు పెడితే.. బెల్ట్ షాపుల నిర్వాహకులు మాత్రం ఎలాంటి డిపాజిట్లు లేకుండా ఒకటి రెండింతలు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో గల్లీ గల్లీకి ఒక బెల్ట్ షాపుతో ప్రజల ఆరోగాన్ని గుల్ల చేస్తున్నారు. మద్యం షాపులో అమ్మేదానికంటే ప్రతి సీసాలో రూ.30 ఎక్కువగానే సొమ్ముచేసుకుంటున్నా.. ఇది అక్రమమని తెలిసినా ఎక్సైజ్ అధికారులు నిమ్మకునీరెత్తినట్టే వ్యవహరిస్తున్నారు. ఇక ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అన్న తమ శాఖ పదంలో ప్రొహిబిషన్ అనేది ఎక్కడ కనిపించడం లేదన్న వాదన వినిపిస్తున్నది.
కల్లుగీత కార్మికులకు న్యాయమేది..? : ఆశన్న గౌడ్, కల్లుగీత కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు
ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు మేలు చేస్తున్నట్టుగా నీరా పాలసీని తెచ్చింది. అయినా విచ్చలవిడిగా లిక్కర్ షాపులను పెంచడంతో పాటు గ్రామాల్లో యదేచ్ఛగా బెల్ట్షాపులను ప్రోత్సహించడం మంచిపద్దతి కాదు. ఎక్సైజ్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయకుండా మామూళ్లకు అలవాటు పడ్డారు. దాంతో బెల్డ్షాపుల వాళ్లు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా పరిస్థితులు నెలకొన్నాయి. కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు పెంచాలి. కల్లువృత్తిలో ఉన్న వారిని ఆదుకోవాలి.