Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల్లో సానుభూతే గెలిపించదన్న విశ్లేషకులు
- కీలక గ్రామాల్లో టీఆర్ఎస్కు పరాభవం
- దళితబంధు ప్రారంభించిన శాలపల్లిలోనూ రాజేందర్కు ఆధిక్యత
- కొంపముంచిన కొనుగోళ్లు హుజురాబాద్లో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీశ్రేణులకు ధన్యవాదాలు : కేటీఆర్
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితం సీఎం కేసీఆర్కు షాక్నిచ్చింది. దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించినా సీఎం కేసీఆర్ను హుజురాబాద్ ప్రజలు విశ్వసించలేదు. హుజురాబాద్ మండలంలోని శాలపల్లి గ్రామంలో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. శాలపల్లి గ్రామంలో ఈటల రాజేందర్ ఆధిక్యత రావడం గమనార్హం. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కు 659 ఓట్లు పోల్ అయితే, టీఆర్ఎస్కు 452 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 135 ఓట్ల మెజార్టీని ఈటల సాధించడం చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఆయన తనయుడు ఎమ్మెల్యే సతీష్కుమార్ స్వగ్రామం సింగాపూర్లో ఈటలకు 350 ఓట్ల మెజార్టీ వచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సొంత గ్రామం హిమ్మత్నగర్లో (వీణవంక)నూ ఈటలకు 191 ఓట్ల మెజార్టీ, 'గెల్లు' అత్తగారి గ్రామం పాపయ్యపల్లి (హుజురాబాద్)లోనూ 76 ఓట్ల మెజార్టీ రావడమే కాకుండా, పాడి కౌశిక్రెడ్డి స్వగ్రామంలోనూ మెజార్టీ రావడం విమర్శలకు తావిచ్చింది. ప్రచార బాధ్యతలు స్వీకరించి అన్ని తానై నడిపించిన ట్రబుల్ షూటర్, మంత్రి హరీశ్రావుకు ఈ ఫలితం ఇబ్బందికరంగా మారింది. ఈటల రాజేందర్ ప్రచార వ్యూహం ఫలించింది. పార్టీల మధ్య పోటీ కాదని, వ్యక్తుల మధ్యే పోటీ అని 'ఈటల' చేసిన ప్రచారం ప్రజలు అర్ధం చేసుకున్నారని, అందుకే నియోజకవర్గంలో బీజేపీకి పునాదులు లేకపోయినా 'ఈటల'ను అన్ని మండలాల్లో ప్రజలు ఓటు వేసి గెలిపించారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.సీఎం కేసీఆర్, తనకు జరుగుతున్న పోటీని అధర్మానికి, ఆత్మగౌరవానికి జరుగుతున్న పోరాటంగా 'ఈటల' ప్రజల్లోకి తీసుకువెళ్లారు. పార్టీల మధ్య పోటీ కాదని, హుజురాబాద్ ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోటీగా 'ఈటల' చేసిన ప్రచారం చేయడం.. ఆ రకంగా ప్రజల నుంచి సానుభూతి పొందడం, అదేవిధంగా ఎప్పట్నుంచో టీఆర్ఎస్తో ఉండటంతో ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కార్యకర్తలు, నాయకులు మద్దతివ్వడం, కేసీఆర్ను ఒకసారి ఓడించి షాక్ ఇవ్వాలన్న భావన ఆ పార్టీ నేతల్లో ఉండటం, తనను క్యాబినెట్ నుంచి అవమానకరంగా బర్తరఫ్ చేయడం, అక్రమంగా కేసులు పెట్టడం, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తాను చేసిన త్యాగాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించడంలో 'ఈటల' గెలుపునకు కారణమయ్యాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీల మధ్య జరుగుతున్న పోటీగా ప్రజలు భావించేలా టీఆర్ఎస్ నేతలు చేయకపోవడం, మంత్రి హరీశ్రావు కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, పర్యవసానంగా అన్ని మండలాల్లో 'ఈటల' ఆధిక్యాన్ని చాటారు. ఎన్నికలకు ముందు మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈటలకు కలిసొచ్చాయని పలువురు అభిప్రాయపడ్డారు.
'కెప్టెన్' పరేషాన్
ఉప ఎన్నికల్లో హుజురాబాద్ పట్టణంతోపాటు, మండలంలోని పలు గ్రామాలకు ఇన్ఛార్జిగా వ్యవహరించిన రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఆయన తనయుడు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్కుమార్ల స్వగ్రామం హుజురాబాద్ మండలం సింగాపూర్లోనూ ఈటల రాజేందర్ మెజార్టీ సాధించారు. సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహత కుటుంబమైన 'కెప్టెన్' కుటుంబానికి మండలంలో మంచి పట్టుందని భావిస్తారు. అలాంటి సింగాపూర్ గ్రామంలో బీజేపీకి 350 ఓట్ల మెజార్టీ రావడం గమనార్హం.
మహామహులు టిఆర్ఎస్లో చేరినా ఫైదా నహీన్..
హుజురాబాద్ ఉప ఎన్నికలో రాజకీయ లబ్ది పొందడానికి సీఎం కేసీఆర్ చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. కాంగ్రెస్కు చెందిన పాడి కౌశిక్రెడ్డి, ఎల్. రమణ (టీడీపీ), ఇనుగాల పెద్దిరెడ్డి (బీజేపీ), మోత్కుపల్లి నర్సింహులు (బీజేపీ)లను సీఎం కేసీఆర్ టిఆర్ఎస్లో చేర్చుకున్నా, వీరి ప్రభావం ఈ ఎన్నికలపై పడలేదు. వీరి చేరిక అధికార టిఆర్ఎస్ అభ్యర్థి విజయానికి బాటలు వేయలేకపోయాయి.
కొంపముంచిన కొనుగోళ్లు
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలవడానికి 'ఈటల'ను ఓడించడానికి సీఎం కేసీఆర్ ఆదేశాలతో టిఆర్ఎస్ మంత్రులు ఆయన అనుచరులందరినీ కొనుగోలు చేశారని ప్రచారం జరిగింది. ఎంపిపిలు, జడ్పీటిసిలు, మున్సిపల్ ఛైర్మన్లు, ఎంపిటిసిలు, సర్పంచ్లు ఇలా ఎవ్వరినీ అధికార టిఆర్ఎస్ వదల్లేదు. పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి వారందరినీ కొనుగోలు చేసిన విషయం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.ఇంత చేసినా ప్రతికూల ఫలితానిచ్చింది.
అధికారుల బదిలీలతో..
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ చేసింది. 'ఈటల'కు సన్నిహితులనే నెపంతో, ఇతర కారణాలతో నియోజకవర్గంలోని 5 మండలాల్లో తహశిల్దార్లను, ఎంపిడివోలను, మున్సిపల్ కమిషనర్లను, డిఎస్పీలను, సిఐలు, ఎస్సైలను సైతం బదిలీ చేసింది. ఈ పరిణామాలన్నీ 'ఈటల' ప్రజల వద్దకు తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యారు. అధికార టిఆర్ఎస్ పార్టీ వ్యూహాలన్నీ బెడిసికొట్టాయనే చెప్పాల్సి వుంటుంది. అన్ని మండలాల్లో ఏ ఒక్క మండలంలోనూ టీఆర్ఎస్కు మెజార్టీ రాలేదు. హుజురాబాద్లో మంత్రి గంగుల కమలాకర్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యే సతీష్కుమార్, వీణవంక మండలంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, జమ్మికుంట పట్టణంలో ఎమ్మెల్యే నరేందర్, కరీంనగర్ మేయర్, జడ్పీ ఛైర్మన్, జమ్మికుంట మండలంలోని గ్రామాలకు ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఇల్లంతకుంట మండలంలో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, కమలాపూర్ మండలంలో ఎమ్మెల్యేలు బాల్క సుమన్, చల్లా ధర్మారెడ్డిలతోపాటు జడ్పీ ఛైర్మన్లు, మేయర్లు గత మూడు, నాలుగు నెలలుగా ఆయా మండలాల్లో మకాం వేసి ఎన్ని ప్రయత్నాలు చేసిన టీఆర్ఎస్ను గెలిపించలేకపోయారు.
ఆ ఓట్లయినా ఆయన వల్లేనా..
ఈటల రాజేందర్ను ఓడించేందుకు మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు శక్తివంచనలేకుండా ప్రయత్నించారు. అయినా ఫలించలేదు. గత నాలుగైదు ఎన్నికల్లో గెలుచుకుంటూ, హుజురాబాద్లో తిరుగులేని నేతగా వ్యక్తిగతంగా సొంత ఇమేజ్ ఏర్పరచుకున్న ఈటల రాజేందర్కు మెజార్టీని తగ్గించి.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ గట్టి పోటీ ఇవ్వడం.. అదంతా మంత్రి హరీశ్రావు కృషే కారణమని గులాబీ శ్రేణులు అభిప్రాయపడ్డాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు లాంటి పథకాలు ప్రారంభించి నా ఆవేమి ఫలించలేదు. పెట్రోల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నా, రైతు వ్యతిరేక చట్టాలపై రైతులు ఉద్యమిస్తున్నా.. ఆ ప్రభావం తనపై పడకుండా.. స్థానిక అంశాల చుట్టూనే ఈటల రాజేందర్ ప్రచారం చేసి గెలిచారని విశ్లేషకులు అంటున్నారు.