Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హుజూరాబాద్లో టీఆర్ఎస్కు ప్రతికూల ఫలితం
- పని చేయని దళిత బంధు, ఇతర పథకాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మనోభావాలు.. ఆత్మగౌరవం.. అహంభావం.. అధికార దర్పం... హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి మొన్నటి వరకూ మైకుల్లో మార్మోగిన సానుభూతితో కూడిన నినాదాలివి. వీటికి భిన్నంగా దళిత బంధు, వారి సమగ్రాభివృద్ధి, ఇందుకోసం ఒకే ఒక్క నియోజకవర్గానికి ఏకంగా రూ.2 వేల కోట్లు... అదే హుజూరాబాద్లో అధికార పార్టీ నేతల నోటి నుంచి వచ్చిన హామీలు, వాటికి అనుగుణంగా విడుదలైన నిధులివి. చివరికి ఫలితం కారు పార్టీని ఖంగు తినిపించగా, ఇష్టం లేకపోయినా బీజేపీలో చేరాల్సి వచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్లో మాత్రం జోష్ నింపింది. మొత్తంగా అధికార టీఆర్ఎస్ పరిస్థితి... 'అనుకున్నదొక్కటీ.. అయినదొక్కటీ...' అనే విధంగా తయారైంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు... ఇలా యావత్ శక్తియుక్తులను ఒడ్డి పోరాడినా రిజల్ట్ రివర్స్గా రావటంతో గులాబీ శ్రేణులు నిరాశ చెందాయి. కేసీఆర్ చరిష్మాకుతోడు ట్రబుల్ షూటర్ హరీశ్రావు ఉప ఎన్నిక బాధ్యతను తన భుజానికెత్తుకోవటంతో నాగార్జున సాగర్, హుజూర్నగర్లోని దృశ్యమే ఇక్కడా ఆవిష్కృతమవుతుందని టీఆర్ఎస్ శ్రేణులు మొదటి నుంచి అంచనా వేస్తూ వచ్చాయి. కానీ హుజూరాబాద్లో... 'హుజూర్నగర్' సీన్ రిపీట్ కాలేదు సరికదా, 'దుబ్బాక' మాదిరి చేదు అనుభవం ఎదురైంది. దీంతో అధికార పార్టీ వేసుకున్న సమీకరణాలు, లెక్కలు గల్లంతయ్యాయి. కేసీఆర్కు కుడి భుజంలాగా ఉండి... ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన మాజీ మంత్రిపై అదే ఉద్యమంలో ఓయూ నాయకుడిగా పనిచేసిన గెల్లును నిలిపితే సరిపోతుందని భావించిన అధినేత ఆలోచన... అక్కడ చెల్లుబాటు కాలేదు. సోమవారం రాత్రి వరకూ విజయం తమదేనన్న ధీమాతో కాలరెగరేసిన కారు పార్టీ నేతలు... ఊహించని ఈ ఫలితంతో అవాక్కవగా, అధినేతలు, ముఖ్య నేతలు మీడియాకు ముఖం చాటేశారు. 'టీఆర్ఎస్కు ఓటేసిన వారందరికీ అభినందనలు...' అంటూ ముక్తసరిగా ప్రకటించి వదిలేశారు. ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకుంటున్న హస్తం పార్టీ, ఇప్పుడు అనివార్యంగా కమలంతో దోస్తీ చేసిందనే అపవాదును మూటగట్టుకుంది. తద్వారా ఆ పార్టీ తానేం సాధించిందో తెలియదు గానీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వేయి మైళ్ల వేగంతో అమల్జేస్తున్న బీజేపీకి, దాని విధ్వంసర విధానాలను వత్తాసు పలికినట్టైంది. ఏదేమైనా 'మాకు మెజారిటీ ఉంది కాబట్టి, ప్రతీ ఎన్నికల్లో గెలుస్తున్నాం కాబట్టి.. మేం ఏం చేసినా చెల్లుబాటవుతుంది...' అనే పద్ధతిలో వ్యవహరిస్తున్న కారు పార్టీకి, ఇప్పటికైనా కనువిప్పు కలగాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకుంటూ ముందుకు పోవాల్సిన తరుణమిది. తద్వారా బంగారు తెలంగాణకు బాటలు వేయాల్సిన సమయమిది. కాదని అధికార దర్పంతోనో, అహంభావంతోనో విర్రవీగితే... రాష్ట్రం, ప్రజలు తీవ్రంగా నష్టపోతారనే దానికి హుజూరాబాద్ ఫలితం ఓ చక్కని ఉదాహరణ.