Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడి మహిళ మృతి చెందగా 9 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నేలకొండపల్లి మండలం మంగాపురంతండాకు చెందిన 20 మంది వ్యవసాయ కూలీలు మండల పరిధిలో పెద్దమండవ గ్రామానికి చెందిన చింతల అప్పారావు అనే రైతు పొలంలో పత్తి తీతకు రైతు ట్రాక్టర్లో బయలుదేరారు. ట్రాక్టర్ ఓనర్, డ్రైవర్ అప్పారావు తానే స్వయంగా అతి వేగంగా, నిర్లక్ష్యంగా ట్రాక్టర్ను నడపడంతో వల్లభి గ్రామం వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో మంగాపురం తండాకు చెందిన గుగులోతు అనిత (35) అక్కడికక్కడే మృతి చెందింది. మరో 9 మందికి తీవ్రగాయాలు కాగా అందులో ముగ్గురు మహిళల పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వైద్యచికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.