Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీపీఆర్లను సీడబ్ల్యూసీకి పంపండి
- జీఆర్ఎంబీ చైర్మెన్కు ఈఎన్సీ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గోదావరి, కృష్ణాబోర్డులు, తెలంగాణ సాగునీటి పారుదల, ఆయకట్టు శాఖ మధ్య లేఖల యుద్ధం కొనసాగుతున్నది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలులో చోటుచేసుకుంటున్న జాప్యం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, అనుమతులు, నిర్వహణ, నీటి కేటాయింపుల్లో గందరగోళానికి ఇది కారణమవుతున్నది. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య ఉప్పు నిప్పు అన్నట్టుగా పరిస్థితులు మారాయి. ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్నది. ఇటీవల తెలంగాణ సాగునీటి శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి. మురళీధర్, కెఆర్ఎంబీ, జీఆర్ఎంబీలకు రాసిన లేఖలు, అందుకు ప్రతిస్పందనగా కెఆర్ఎంబీ నుంచి సర్కారుకు వచ్చిన లేఖ రాష్ట్రంలో చర్చనీయాంశమవుతున్నాయి. సాగునీటిరంగ నిపుణుల్లోనూ ఈ సంఘటనలను ఒకింత ఆసక్తిని పెంచుతున్నాయి.
ఈ పరిణామాలపై సీఎం కేసీఆర్ సైతం ఆసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. న్యాయమైన హక్కుల విషయంలో వెనక్కి తగ్గేది లేదనీ, ఎప్పటికప్పుడు కెఆర్ఎంబీ, జీఆర్ఎంబీ బోర్డుల చర్యలపై స్పందించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ)కు తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ బుధవారం మరో లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ప్రాజెక్టుల డీపీఆర్లను ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారమే పరిశీలించి, కేంద్ర జల సంఘానికి పంపాలని లేఖలో కోరారు. చౌటుపల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకం, ముక్తేశ్వర (చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల పథకం, తుపాకుల గూడెం, సీతారామ ఎత్తిపోతల పథకం, మోడికుంట వాగు ప్రాజెక్టులు కొత్తవి కావని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రారంభించిన ప్రాజెక్టులనీ, ఇవి విభజన చట్టం పరిధిలోకి రావని పేర్కొన్నారు. ఆయా ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించిన 967.94 టీఎంసీల్లో భాగంగానే ఉన్నాయనీ, ఇవి ఏపీ నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం చూపబోవని అన్నారు. ఈ ప్రాజెక్టులన్నీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందే ఉమ్మడి రాష్ట్రం చేపట్టినవనీ, డీపీఆర్లలో ఇరిగేషన్ ప్లానింగ్, అంచనా విలువలు, డిజైన్, నీటి లభ్యత తదితర సాంకేతిక అంశాలను పరిశీలించే అధికారం జీఆర్ఎంబీకి లేదనీ, ఇందుకు కేంద్ర జలసంఘంలో ప్రత్యేకమైన డైరెక్టరేట్లు ఉన్నాయన్నారు. కేఆర్ఎంబీ గతంలో రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని పరిశీలించడానికి నేరుగా కేంద్ర జలసంఘానికి పంపించిందనీ, డీపీఆర్ల పరిశీలనలో రెండు బోర్డులు భిన్నమైన పద్ధతులు అవలంభిస్తున్నాయని చెప్పారు. పూర్తయిన, కొనసాగుతున్న ప్రాజెక్టుల డీపీఆర్లకు సాంకేతిక అనుమతులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర జలసంఘానిదేననీ, బోర్డులది కాదని స్పష్టం చేశారు. రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడా కేంద్ర జలశక్తి మంత్రి డీపీఆర్లను త్వరితగతిన పరిశీలించి ఆమోదిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వెంటనే గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్లను కాలయాపన చేయకుండా వెంటనే కేంద్ర జల సంఘానికి నివేదించాలని విజ్ఞప్తి చేశారు.