Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్డీ జీ రఘుమారెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
విద్యుత్ వినియోగదారులకు సంతృప్తికరమైన సేవలు అందిస్తేనే సంస్థల మనుగడ సాధ్యమవుతుందని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్డీ జీ రఘుమారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భముగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలోని జోనల్, సర్కిల్, డివిజన్, సబ్-డివిజన్, ఈఆర్వో కార్యాలయాల్లో విద్యుత్ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. మెట్రో జోన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రఘుమారెడ్డి ముఖ్య అతిధిగా హాజరై, ప్రసంగించారు. విద్యుత్ సంస్థలపై వినియోగదారుడు ఆధారపడి లేడనీ, అతనిపైనే ఉద్యోగులుగా అందరూ ఆధారపడి ఉన్నారని చెప్పారు. వారితో మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించారు. వినియోగదారుల సౌకర్యార్ధం సంస్థ ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు ప్రవేశపెడుతున్నదనీ, నూతన సర్వీసుల మంజూరు, పేరు మార్పు, బిల్లింగ్ సవరణ వంటి వివిధ సేవల కోసం సంస్థ వెబ్సైట్, యాప్్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి విద్యుత్ పంపిణి వ్యవస్థను పటిష్టం చేసేందుకు డిస్కం పరిధిలో రూ. 11,855 కోట్ల వ్యయంతో వివిధ పనులు చేపట్టామని తెలిపారు. అలాగే 2014 లో 4,989 మెగావాట్లగరిష్ట డిమాండ్ ఉండగా, నేడు 8,474 మెగావాట్లకు పెరిగిందని చెప్పారు. రాష్ట్రావతరణకు ముందు 101.72 మిలియన్ యూనిట్లు ఉన్న విద్యుత్ వాడకం, ఇప్పుడు 180.51 మి.యూ., పెరిగిందని వివరించారు. కార్యక్రమంలో విద్యుత్ అంబుడ్స్మెన్ నాగరాజు, తాజ్ బంజారా చీఫ్ ఇంజనీర్ ఎమ్ఎల్ శర్మ, డైరెక్టర్లు కే రాములు, ఎస్ స్వామిరెడ్డి, మెట్రోజోన్ చీఫ్ జనరల్ మేనేజర్ నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.