Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుట్రదారుడు కుట్రలతోనే నాశనం అవుతాడు
- ఇక వారి భరతం పట్టుడు ఖాయం
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్
నవతెలంగాణ-హుజురాబాద్
హుజూరాబాద్ ఉప ఎన్నికల విజయాన్ని నియోజకవర్గ ప్రజలకు అంకితం ఇస్తున్నానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని మధువణి గార్డెన్లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ''నా చర్మం ఒలిచి హుజూరాబాద్ ప్రజలకు చెప్పులు కుట్టించినా.. నేను వారి రుణం తీర్చుకోలేను. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటా.. నాలాంటి కష్టం శత్రువుకి కూడా రావొద్దు.. నన్ను ఓడించడానికి ఇక్కడికి వచ్చిన వారి భరతం పట్టుడు ఖాయం..'' అని అన్నారు. కుట్రదారుడు కుట్రలలోనే నాశనం అయిపోతాడన్నారు. 2 గుంటల మనిషి కోట్ల రూపాయల డబ్బు ఎలా ఖర్చు పెట్టాడని ప్రశ్నించారు. కేసీఆర్ మొఖంతో వెళ్లినప్పుటి కంటే ఇప్పుడు తనకు ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. తాను పార్టీలు మారేవాడిని కాదని, తన చరిత్ర తెరిచిన పుస్తకమని అన్నారు. కేసీఆర్ అహంకారాన్ని, బెదిరింపులను లెక్కచేయకుండా ఓటేసి చెంప చెల్లు మనిపించారన్నారు. ప్రపంచ చరిత్రలోనే ఇలాంటి ప్రలోభాలతో కూడిన ఎన్నిక ఎక్కడా జరగలేదన్నారు. కులాల పరంగా చీలిక తెచ్చినా.. అనేక ప్రలోభాలకు గురిచేసినా.. ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని భారీ విజయాన్ని అందించారన్నారు. ప్రపంచంలోని తెలుగు వారంతా నా గెలుపును కోరుకున్నారన్నారు.