Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు నెలల బాబు మృతి
- ఆస్పత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన
నవతెలంగాణ-జనగామ
ప్రయివేటు ఆస్పత్రిలో డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా రెండు నెలల బాబు మృతి చెందిన ఘటన జనగామ జిల్లాలో బుధవారం జరిగింది. బాలుడి మృతదేహాన్ని ఆస్పత్రి ఎదుట ఉంచి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డాక్టర్ను నిలదీశారు. దాంతో పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. మృతి చెందిన బాలుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన నల్ల లావణ్య, పవన్కుమార్ దంపతుల కుమారుడికి (2నెలలు) జలుబు చేసిందని 10 రోజుల కిందట పట్టణానికి చెందిన లోటస్ పిల్లల ఆస్పత్రికి తీసుకొచ్చారు. కాగా ప్రభుత్వాపత్రిలో పనిచేస్తూ లోటస్ ఆస్పత్రి నిర్వహిస్తున్న డాక్టర్ రాంమూర్తి బాలుడికి చికిత్స చేశాడు. ఊపిరితిత్తుల సమస్య ఉందనీ, హాస్పటల్లో ఉంచి చికిత్స చేయించుకుంటే నయమవుతుందని తెలిపాడు. డాక్టర్ చెప్పినట్టుగానే 5 రోజులు ఆస్పత్రిలో ఉండి బాలుడికి చికిత్స చేయించారు. తర్వాత డాక్టర్తో మందులు రాయించుకుని బాలుడిని ఇంటికి తీసుకెళ్లారు. బాలుడికి ఇబ్బందిగా ఉంటే మరల ఆస్పత్రికి తీసుకరమ్మని డాక్టర్ రాంముర్తి చెప్పి పంపించారు. కాగా బుధవారం జలుబు ఎక్కువైందని బాలుడిని తిరిగి లోటస్ ఆస్పత్రికి తీసుకురాగా.. పరీక్షించిన డాక్టర్.. మధ్యాహ్నం 1.30 తర్వాత వ్యాధి ఎక్కువైందనీ, వరంగల్ తీసుకెళ్లాలని చెప్పి ఇంజక్షన్ వేశాడు. కొద్ది సేపటికే బాలుడు ఉలుకు పలుకు లేకపోవడంతో వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన వెంటనే పరిక్షించిన డాక్టర్లు.. రెండు గంటల కిందటే బాబు చనిపోయాడని చెప్పారు. దాంతో ఆవేదనకు గురైన బాలుని కుటుంబసభ్యులు డాక్టర్ రాంమూర్తి నిర్లక్ష్యం కారణంగానే చనిపోయాడనే ఆవేదనతో జనగామలోని లోటస్ ఆస్పత్రిపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో ఆస్పత్రి ఫర్నీచర్, గ్లాస్లు ధ్వంసం ఆయ్యాయి. తమకు వాస్తవ పరిస్థితిని డాక్టర్ చెప్పకుండా కాలయాపన చేశాడనీ, లేకుంటే తమ బాబును సరియైన సమయంలో వరంగల్కు తీసుకెళ్లి బతికించుకునేవాళ్లమని తల్లి లావణ్య బోరున విలపించారు. కాగా ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులను పోలీసులు పోలీస్స్టేషన్కు తరలించారు.