Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కామారెడ్డి జిల్లాలో గౌడకులస్తులపై వీడీసీ హుకుం..
- డబ్బులు కట్టే వరకూ గ్రామస్తులెవరూ కల్లు తాగొద్దని చాటింపు
నవతెలంగాణ-రామారెడ్డి
రూ.2.5లక్షలు చెల్లిస్తేనే గ్రామంలో కల్లు విక్రయానికి అనుమతిస్తామని గ్రామ అభివృద్ధి కమిటీ(వీడీసీ) హుకుం జారీ చేసింది. ధరల పెరుగుదలతో పాటు అధికారులకు మామూళ్లు ఇవ్వడంతో తమకు గిట్టుబాటు కావడం లేదనీ, అంత చెల్లించుకోలేమని రూ.60 వేలు కడతామని గౌడసంఘం వారు విన్నవించుకున్నారు. దాంతో కక్ష కట్టిన వీడీసీ.. గ్రామంలో కల్లు ఎవరూ తాగొద్దనీ, అతిక్రమిస్తే రూ.1000 జరిమానా విధిస్తామనీ, ఎవరైనా తాగినట్టు సమాచారం ఇస్తే రూ.500 బహుమతి చెల్లిస్తామని చాటింపు చేయించింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మోషన్పూర్లో ఆలస్యంగా వెలుగుజూసింది. వివరాల్లోకి వెళ్తే..
మోషన్పూర్ గ్రామంలో 26 గౌడకుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో కల్లు దుకాణం నిర్వహిస్తున్నందుకు వీడీసీకి రూ.2.50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసింది. అంత డబ్బులు ఇవ్వలేమని గౌడ కులస్తులు విన్నవించగా.. గ్రామంలో కల్లు విక్రయాలపై ఆంక్షలు విధించింది. అక్టోబర్ 10వ తేదీ నుంచి కల్లు దుకాణాన్ని మూసి.. దుకాణానికి చెప్పులదండ వేలాడదీశారు. దాంతో కల్లుకు అలవాటు పడిన పలువురు కల్లుకోసం పక్క గ్రామాలకు వెళ్లి తాగుతూ ప్రమాదాల బారినపడుతున్నారు. గ్రామానికి చెందిన మురికాల రాజయ్య ఇటీవల పక్కన గల పోసానిపేట గ్రామానికి కల్లు తాగడానికి సైకిల్పై వెళ్లాడు. తిరిగి వస్తుండగా కిందపడటంతో కాలు విరిగింది. కాగా మురికాల చిన్న గంగయ్య, తోకల నవీన్ తదితరులు కల్లు తాగడంతో వారికి తలా రూ.వేయి చొప్పున జరిమానా విధించారు. ఈ విషయమై వీడీసీని వివరణ కోరగా.. కల్తీ కల్లు విక్రయిస్తున్నారనీ, నాణ్యమైన కల్లు విక్రయించాలని గౌడ కులస్తులను కోరినట్టు బుకాయించే ప్రయత్నం చేశారు. దాంతో అబ్కారీ శాఖకు, కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
కల్తీకల్లు విక్రయించినట్టు తేలలేదు
గ్రామంలో కల్తీ కల్లు విక్రయాలు చేస్తున్నట్టు గ్రామ స్తులు ఫిర్యాదు చేయడంతో తనిఖీలు చేపట్టాం. కల్తీకల్లు విక్రయిస్తున్నట్టు తేలలేదు. కల్తీ కల్లు విక్రయిస్తే చట్టపర మైన చర్యలు తీసుకుంటాం. కాగా వీడీసీ కల్లు దుకాణం మూసివేయించిందని ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. వీడీసీతో తమకు సంబంధం లేదని తెలిపారు.
- ఫణీంద్ర రెడ్డి, ఎక్సైజ్ సీఐ
సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి
వీడీసీలు సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. వీడీసీలకు ఎలాంటి హక్కులు, నియామకాలు లేవు. గ్రామాభివృద్ధి పేరు చెప్పి, గ్రామంలో నివసిస్తున్న గౌడ కులస్తులతో పాటు వివిధ కుల వృత్తులు చేసుకుంటున్న మధ్య తరగతి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం సరైనది కాదు. అధికారులు వీడీసీలను రద్దు చేసి, డబ్బులు డిమాండ్ చేసిన వీడీసీ సభ్యులపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
- వెంకట్ గౌడ్, గీత కార్మిక సంఘం
జిల్లా అధ్యక్షులు