Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వామపక్ష ఉద్యమాలతో సర్కారులో కదలిక
- సీపీఐ(ఎం) గిరిజన సంఘం నేతృత్వంలో పోరాటం
- 8 నుంచి పోడుదారుల దరఖాస్తుల స్వీకరణ
- ఉమ్మడి జిల్లాలో 1.46 లక్షల ఎకరాలు సాగు
- కీలకంగా మారనున్న గిరిజన కమిటీలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఎర్రజెండా అండతో గిరిజనుల పోరాటం ఉధృతమవుతోంది. వామపక్ష ఉద్యమాలతో సర్కారులో కదలిక మొదలైంది. 'హరితహారం' పేరుతో గులాబీ ప్రభుత్వం ఏడేండ్లుగా పోడుదారులపై అరాచకాలకు పాల్పడింది. కందకాలు కొట్టడం.. పంటలు ధ్వంసం.. కేసులు పెట్టడం.. యంత్రాలతో వ్యవసాయం చేసుకోనీయకపోవడం.. గత ప్రభుత్వాలు ఇచ్చిన బోర్లు, మోటార్లు నాశనం చేయడం.. అడ్డొచ్చిన వారిపై ఫారెస్టు, పోలీసులు అడ్డగోలుగా విరుచుకుపడటం.. ఇలాంటి ఎన్నో దుశ్చర్యలు నిన్న, మొన్నటి వరకు నిత్యకృత్యంగా మారాయి. లాల్జెండా నీడలో 'పోడు' నాగళ్లు తిరగబడ్డాయి.. పిడికిళ్లు బిగించి పోరు సల్పాయి. ఫలితంగా అటవీహక్కు పత్రాలకు కదలిక వచ్చింది. అనివార్యమై పోడు పట్టాలకు ప్రభుత్వం ఒప్పుకున్నా.. అప్రమత్తంగా లేకపోతే ఈ ప్రక్రియలో కీలకం కానున్న గిరిజన కమిటీలు 'గులాబీ' గుప్పిట్లోకి చేరుతాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,46,678 ఎకరాల సాగు భూములకు హక్కుపత్రాలు అందించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. అటవీభూముల పరిరక్షణే ధ్యేయంగా సిద్ధమైన ఈ ప్రణాళికలు ఎంతమేరకు పోడుదారులకు న్యాయం చేస్తాయనే విషయంలో సందేహాలు ఇప్పటికీ ఉన్నాయి.
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గిరిజన సంఘం పోరాటం
ఖమ్మం జిల్లాలో ప్రధాన పోడు సమస్యలపై సీపీఐ(ఎం), గిరిజన సంఘం పోరాటాలు నిర్వహించారు. కొణిజర్ల మండలం మల్లుపల్లి, తుమ్మలపల్లి, రామనర్సయ్యనగర్, సాలెంబంజర, మేకలకుంట, గుబ్బగుర్తి, అంజనాపురం, గద్దలగూడెం, ఉప్పలచెలక గ్రామాల్లో గతంలో ప్రభుత్వం రెవెన్యూశాఖ ద్వారా పట్టాలు ఇచ్చింది. కానీ ఆ పట్టాలను అటవీశాఖ రద్దు చేసింది. మండలంలో ఐదువేల ఎకరాలు సాగులో ఉండగా 750 మందికి 1,300 ఎకరాలకు హక్కుపత్రాలు ఇచ్చారు. సాగులో ఉన్న 5000 ఎకరాలకు హక్కుపత్రాలివ్వాలని గిరిజన సంఘం పోరాటం చేసింది. చింతకాని మండలం కొదుమూరులోనూ 150 మంది రైతులకు చెందిన 280 ఎకరాలను రెవెన్యూశాఖ పట్టాలు కాదని ఫారెస్టు శాఖ లాగేసుకోవడంతో నేటి వరకూ పోరాటాలు నిర్వహిస్తూనే ఉంది. కారేపల్లి మండలం యర్రబోడు, మాణిక్యారంలో ప్రత్యామ్నాయ భూమి చూపుతామని లాక్కున్న 200 ఎకరాల భూమిని 40 మంది పోడు రైతులకు తిరిగి ఇచ్చేయాలని గిరిజన సంఘం ఉద్యమాలు చేసింది. ఐటీడీఏలో పెండింగ్లో ఉన్న చీమలపాడు సెక్షన్లోని 400 మంది రైతులకు హక్కుపత్రాలివ్వాలనీ పోరాటం చేసింది. కామేపల్లి మండలం తాళ్ళగూడెం సెక్షన్లో మద్దులపల్లి, కెప్టెన్ బంజర, ముచ్చర్ల, జాస్తిపల్లిలో 1952 నుంచి రైతులు 362 ఎకరాలు సాగు చేసుకుంటున్నారు. వీరికి హక్కుపత్రాలివ్వాలని ఉద్యమాలు నిర్మించింది. ఏన్కూరు మండలం కొత్తమేడేపల్లి అటవీప్రాంతంలో ఆదివాసీ గిరిజనులు, గొత్తికోయల తరఫున పోడు ఉద్యమాలు నిర్మించింది. రఘునాథపాలెం మండలం గణేశ్వరం, పంగిడి, చింతగుర్తి, ఈర్లపుడి శివారుగ్రామాల్లో గిరిజనులకు హక్కుపత్రాలు వచ్చాయి. అనేక సంవత్సరాలుగా ఉంటున్న గిరిజనేతర పేదలను ఖాళీ చేయాలని అటవీశాఖ ఆదేశాలిస్తోంది. దీనిపైనా గిరిజన సంఘం అనేక పోరాటాలు చేసింది. ఈ పోరాట ఫలాలు పోడుదారులకు దక్కాలంటే గిరిజన కమిటీలు క్రియాశీలకంగా వ్యవహరించాలని సంఘం నేతలు సూచిస్తున్నారు.
8 నుంచి నెలరోజుల పాటు పోడు దరఖాస్తుల స్వీకరణ
ఈనెల 8వ తేదీ నుంచి నెలరోజుల పాటు ప్రత్యేక కమిటీల ద్వారా పోడుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆయా గ్రామాలు, గూడేల జనాభాను బట్టి 10 నుంచి 15 మందితో గిరిజన కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలకు చైర్మెన్, సెక్రటరీలను నియమిస్తారు. రాజకీయ ప్రమేయం లేకుండా ఈ కమిటీల ఏర్పాటు ఉంటుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా... అప్రమత్తంగా లేకపోతే 'గులాబీ' గుప్పిట్లోకి కమిటీలు వెళ్లే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు అటవీ భూముల ఆక్రమణల లెక్కలు తేల్చిన అధికారులు భవిష్యత్తులో అంగుళం భూమి ఆక్రమణకు గురికాకుండా 'అటవీ భూముల పరిరక్షణే ధ్యేయం'గా ప్రణాళిక రూపొందించింది. పకడ్బందీగా ఈ ప్రణాళిక అమలయ్యేందుకు ప్రత్యేక విజిలెన్స్ బృందాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం వినియోగించనున్నారు. ఈ క్రమంలో ఏమరుపాటు చూపకుండా పది ఎకరాలలోపున్న ప్రతి ఒక పోడుదారుడూ న్యాయం పొందేలా చూడాల్సిన అవసరం గిరిజన కమిటీలపై ఉంది. పారదర్శకతతో కూడిన గిరిజన కమిటీలు ఏర్పడేలా ప్రతి ఒక పోడుదారుడు చూసుకుంటేనే హక్కు పత్రాలు సజావుగా చేతికందుతాయి.
గిరిజన కమిటీలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి
పోడురైతులకు పట్టాలిచ్చే విషయంలో గిరిజన కమిటీలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. రాజకీ య జోక్యం లేకుండా చూసుకోవాలి. ఎఫ్ఆర్సీ కమి టీల్లో అటవీశాఖ జోక్యం లేకుండా చూసుకోవాలి. పోడుదారులందరికీ హక్కుపత్రాలు అందేలా చూడాలి. గిరిజన కమిటీల పాత్ర క్రీయాశీలకంగా ఉండనుంది కాబట్టి అర్హులైన గిరిజనేతరులకు సైతం పట్టాలు అందేలా చూడాలి. లేదంటే ఇన్నాళ్ల పోరాట ఫలితం వృథా అయ్యే ప్రమాదం ఉంది.
- భూక్యా వీరభద్రం, గిరిజన సంఘం
ఖమ్మం జిల్లా కార్యదర్శి