Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వడ్డీ కోసం వెంపర్లాట అవసరం లేదు
- ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ ద్వారానే లావాదేవీలు
- సర్కారు సమాలోచన
- బ్యాంకుల నుంచే రూ.64.50 కోట్లు త్వరలో స్వాధీనం
- భవిష్యత్తులో అవకతకలు జరగకుండా పటిష్ట చర్యలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలుగు అకాడమిలో ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)కి స్వస్తి పలకాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అధిక వడ్డీ వస్తుందన్న కారణంతో ఆ సంస్థ పలు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ వడ్డీ కోసం వెంపర్లాడే పరిస్థితి ఆ సంస్థకు ఎందుకన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఆ అవసరం లేనందున ఎఫ్డీ చేసేందుకు అవకాశం ఇవ్వొద్దని ప్రభుత్వం సమాలోచన చేస్తున్నది. తెలుగు అకాడమి నగదు లావాదేవీలన్నీ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ద్వారానే జరగాలని నిర్ణయించినట్టు సమాచారం. అందులో భాగంగానే ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్లోనే సొమ్ము జమ చేయడం, తీసుకోవడం చేయాల్సి ఉంటుంది. అకాడమీకి చెందిన రూ.320 కోట్లను గతంలోనే ఫిక్స్డ్ డిపాజిట్లు 12 జాతీయ బ్యాంకులు సహా 31 బ్యాంకుల్లో ఉన్నాయి. వాటిలో రూ.64.50 కోట్ల కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే. తెలుగు అకాడమికి చెందిన మిగిలిన రూ.255.5 కోట్ల ఎఫ్డీలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఆ సొమ్మును ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్లో జమ చేయాలని భావిస్తున్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, తెలుగు అకాడమి అధికారులు, బ్యాంకు అధికారులు కుమ్మకై ఆ అకాడమిలో రూ.64.50 కోట్ల కుంభకోణానికి పాల్పడిన విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. రూ.64.50 కోట్లను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) సంతోష్ నగర్, కార్వాన్ బ్రాంచ్లతోపాటు కెనరా బ్యాంకు చందానగర్ బ్రాంచ్లోనూ తెలుగు అకాడమి అధికారులు ఎఫ్డీ చేశారు. అయితే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం ఆ సొమ్ముకు జవాబుదారీ ఆ బ్యాంకులేనంటూ ప్రభుత్వం చెప్తున్నది. బ్యాంకులను నమ్మి ఎఫ్డీ చేస్తే ఆ సొమ్మును గోల్మాల్ చేస్తే ఖాతాదారులు ఎందుకు నష్టపోవాలని ప్రభుత్వం ప్రశ్నిస్తున్నది. ఎవరికి నచ్చినట్టు వారు డబ్బులను డ్రా చేసి గోల్మాల్ చేస్తే బ్యాంకులపై నమ్మకం పోతుందన్న అభిప్రాయం వినిపిస్తున్నది. దీంతో రూ.64.50 కోట్లు తిరిగి స్వాధీనం చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉన్నది. ఇప్పటికే ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులతో సంప్రదించింది. రూ.64.50 కోట్లు ఇచ్చేందుకు వారు అంగీకరించినట్టు పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి వివరించారు. అయితే ఎప్పటిలోగా ఇస్తారన్నదానిపై మాత్రం స్పష్టత రాలేదు. ఇప్పటికే ఈ కుంభకోణంలో భాగస్వాములైన రియల్ ఎస్టేట్, తెలుగు అకాడమి, బ్యాంకు అధికారులు, ఎపీ మర్కంటైల్ సొసైటీ చైర్మెన్ పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. నిధుల గోల్మాల్, బ్యాంకుల లావాదేవీలు, ఎఫ్డీల వివరాలపై ఆడిట్ నిర్వహించేందుకు ట్రెజరీ అండ్ అకౌంట్స్ విభాగం నుంచి ప్రత్యేకంగా ఇద్దరు ఆడిటర్లను నియమించాలని ప్రభుత్వానికి విన్నవించినట్టు తెలిసింది. పూర్తి వివరాలనూ పరిశీలించి నివేదిక రూపొందించే అవకాశమున్నది. అవకతవకలు చేసేందుకే ఎఫ్డీలను వివిధ బ్యాంకుల్లో ఉద్యోగులు జమ చేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. అందుకే ఎఫ్డీలకు స్వస్తి పలికి, ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్లో ఆర్థిక లావాదేవీలు జరగాలని నిర్ణయించినట్టు తెలిసింది. భవిష్యత్తులో ఇతర శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలో ఇలా అవకతవకలు జరగకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు తీసుకునే విధంగా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు సమాచారం.