Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా ఆధ్వర్యంలో నీలోఫర్ వద్ద నిరసన
నవతెలంగాణ-సిటీబ్యూరో
సిరిసిల్లలో ఆరేండ్ల బాలికపై లైంగిక దాడి చేసిన నిందితున్ని కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి డిమాండ్ చేశారు. ఐద్వా గ్రేటర్ హైదరాబాద్ సౌత్ కమిటీ, గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీల ఆధ్వర్యంలో బుధవారం నీలోఫర్ ఆస్పత్రి వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్.అరుణజ్యోతి, గ్రేటర్ హైదరాబాద్ సౌత్ కమిటీ కార్యదర్శి శశికళ, గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి నాగలక్ష్మి మాట్లాడారు. టీఆర్ఎస్ నాయకుడు బాలికపై లైంగికదాడి చేయడమేగాక, బాలిక తల్లిదండ్రులపై కూడా దాడిచేసి కొట్టాడని తెలిపారు. నిందితుడికి ప్రభుత్వ అండదండలు ఉండటంతోనే బాలికకు సత్వర వైద్యం అందలేదన్నారు. హైదరాబాద్ గోల్కొండ ఏరియాలో ఏడాదిన్నర బాలికపై కూడా పాశవికంగా లైంగికదాడి జరిగిందని, ఆ చిన్నారి కూడా నీలోఫల్లోనే వైద్యం పొందుతోందని, నిందితుడిని పోలీసులు ఇంకా పట్టుకోలేదని తెలిపారు. చిన్నారులపై రోజు రోజుకూ ఈ విధమైన లైంగికదాడులు జరుగుతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని విమర్శించారు. నిందితులకు రాజకీయ, ఆర్థిక పలుకుబడి ఉంటే ఒక న్యాయం, లేకుంటే ఇంకొక న్యాయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారకపోతే మహిళలు పెద్దఎత్తున ఉద్యమిస్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తక్షణం నిందితులను అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్షులు ఎ.పద్మ, నాయకులు షాబాన, అన్నపూర్ణ, స్వరూప, లావణ్య, సుజాత, తదితరులు పాల్గొన్నారు.