Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవంలో నేతలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యువజన సమస్యలపై నిరంతర పోరాటాలు నిర్మిస్తామని డీవైఎఫ్ఐ, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శులు ఆనగంటి వెంకటేష్, టి స్కైలాబ్బాబు చెప్పారు. బుధవారం డీవైఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేష్, స్కైలాబ్బాబు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్ స్ఫూర్తితో 1980లో పంజాబ్లో లూథియానా నగరంలో నవంబర్ 1, 2 ,3 తేదీల్లో డీివైఎఫ్ఐ ఏర్పడిన నాటి నుంచి యువతీ,యువకుల సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్నదని అన్నారు. దేశంలో విచ్ఛిన్నకర, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా దేశ సమైక్యత, సమగ్రాభివధ్ది కోసం డీవైఎఫ్ఐ అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తున్నదని గుర్తు చేశారు. కేంద్రంలోని మోడీ సర్కార్ నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యారనీ, నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పి ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రయివేటుపరం చేస్తూ బడా పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నారని చెప్పారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనుకున్న యువతకు నిరాశే మిగిలిందన్నారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో 1,91,126 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటూ బిశ్వాల్ నివేదిక ఇచ్చిందని వివరించారు. అయినా ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ, నిరుద్యోగ యువతను మోసం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ ఇవ్వకపోవడంతో వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభించే యువజన వ్యతిరేక విధానాలపై పోరాడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ, కేవీపీఎస్, ఎస్ఎఫ్ఐ నాయకులు కొమ్ము విజరు, జావీద్, అశోక్ రెడ్డి, పవన్, సుధాకర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.