Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంధన భారం..
-సరుకుల ధరలు పైపైకి..
- 20 నుంచి 50 శాతం రేట్ల పెరుగుదల
- సబ్బు నుంచి పప్పు దాకా అన్నింటిదీ అదే దారి
- మండుతున్న కూరగాయలు ఆకుకూరలూ కొనలేని దుస్థితి
- దీపావళి పూజాసామాగ్రి రేట్లకూ రెక్కలు
- 3 రూపాయల నోములదండ నేడు పది రూపాయలు
- పేదల బాధలు పట్టని మోడీ సర్కారు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మోడీ సర్కారు హయాంలో రోజురోజుకీ పైపైకి దూసుకుపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. ఇం'ధన'భారంతో అదీ.. ఇదీ.. అనే తారతమ్యం లేకుండా అన్ని నిత్యావసరాలూ పిరమైపోయాయి. ఉప్పు నుంచి పప్పు దాకా..దీపం ఒత్తు నుంచి నూనె వరకు ఏది పట్టుకున్నా అగ్గిమీద గుగ్గిలంలా ధరలు మండిపోతున్నాయి. దీపావళి పూజాసామాగ్రి రేట్లకూ రెక్కలొచ్చి పైపైకి దూసుకుపోతున్నాయి. కూరగాయలను రేట్లను చూసి ఏం కొనే(తినే)టట్టు లేదని వినియోగదారులు లబోదిబోమంటుంటే..తెచ్చిన సరుకు ఎలా అమ్మాలిరా బాబు? అని వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. కేవలం రోజుల వ్యవధిలోనే 20 నుంచి 50శాతం దాకా ధరలు పెరిగి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కరోనా కాలంలో ఓవైపు ఉద్యోగాలు పోయి..మరోవైపు వేతనాల్లో కోతలతో సగటు జీవి సతమతమవుతున్నాడు. ఆదాయం బెత్తెడు...నిత్యావసర వస్తువుల కొనుగోలు ఖర్చు బారెడుగా మార్చి సామాన్యులకు దీపావళి పండుగ అనే సంతృప్తి కూడా లేకుండా ఏలికలు చేశారు. అన్ని రోగాలకు సర్వరోగ నివారిణి జిందాతిలాస్మత్ అన్నట్టుగానే..అన్ని నిత్యావరాల రేట్ల పెరుగుదలకు కారణమవు తున్న డీజిల్ రేట్లను వెంటనే తగ్గించాలనే డిమాండ్ ప్రజలను నుంచి వ్యక్తమవుతున్నది.
తారాజువ్వలా దూసుకుపోతున్న డీజిల్ ధర
దీపావళి పండుగపూట బాంబుల పేలుళ్ల సౌండ్ కంటే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై బాదుతున్న ధరల భారమే సామాన్యులను భయపెడు తున్నది. ఈ ఏడాది మే నెల ప్రారంభంలో డీజిల్ ధర రూ.88.24 ఉండగా..ఆ నెలా ఖరు వరకు అదికాస్తా 94.50కి చేరింది. అప్పటి నుంచి డీజిల్ ధర పెరుగుతూనే ఉన్నది. అంతర్జాతీ యంగా ముడిచమురు ధర తక్కువే ఉన్నప్పటికీ గడిచిన పది రోజుల నుంచి డీజిల్ ధర తారాజువ్వలా ఆకాశంవైపు దూసుకుపో తూనే ఉంది. ప్రస్తుతం లీటర్ డీజిల్ రూ.107. 40కి చేరింది. అంటే ఐదు నెలల్లో లీటర్ డీజిల్ ధర 20 రూపాయలు పెరిగింది. దీని ప్రభావం ట్రాన్స్పోర్ట్ రంగంపై పడింది. దాని ఫలితంగా ఇటీవలికాలంలో నిత్యావసర సరుకుల ధరలు 20 నుంచి 50 శాతం దాకా పెరిగాయి. గత పది రోజులుగా ప్రతి రోజూ పెరుగుతూ పోతున్నది.
పూజా సామాగ్రి.. వయా స్వీట్లు, బాంబుల
వరకూ అన్నీ పెరుగుడే..
దీపావళి ఒక ముఖ్యమైన పండుగ. లక్ష్మి పూజ చేయడం, బాంబులు పేల్చడం సాంప్రదాయం. కేంద్రంలో కార్పొరేట్ల సేవలో తరిస్తూ మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాల ప్రభావం సామాన్యుడు పండుగ చేసుకోలేని పరిస్థితిని కల్పించింది. ఈ ఏడాది విపరీతంగా డీజిల్ రేట్ల పెరుగు దలతో సరుకుల రవాణా చార్జీలు పెరిగాయి. దీంతో దీపా వళి పండుగపూట తీపి వంటకాలూ తినలేని పరిస్థితి. గతేడాది పేనీల కేజీ ధర రూ.80 నుంచి 100 వరకు ఉన్నది. ఈసారి కిలో రూ.130 నుంచి 150 వరకు పలుకు తున్నది. కిలో చక్కర మొన్నటి వరకూ రూ.40కు లభించ గా..అది కాస్తా నేడు రూ.45కి చేరింది. దీని ప్రభావం స్వీట్ల ధరలు కూడా పెరిగాయి. పూజా సామాగ్రికి రెక్కలొచ్చి చుక్కలను చూపెడుతున్నాయి. 'గతేడాది రూపాయి పెడితే చిన్న నోము దండ, మూడు రూపాయలు పెడితే పెద్ద నోముల దండలు వచ్చేవి. నేడు చిన్నదే మూడు రూపాయ లైంది. పెద్దదానికైతే రూ.10. ఆరు నెలల కింద దేవుడు వద్ద దీపం పెట్టే నూనె డబ్బా రూ.100 ఉంటే డీజిల్ ధరల ప్రభావం వల్ల అది నేడు రూ.150కి చేరుకున్నది. గతేడాది హారతి కర్పూరం రూ.400 ఉండగా...దాని ధర నేడు రూ.1100 పలుకుతున్నది. చివరకు అగర్వత్తీల ధరలు కూడా పెరిగాయి. బ్రాండ్ను బట్టి ఒక్కో ప్యాకెట్పై ఉన్న ధరపై రూ.10 నుంచి రూ.40 వరకు పెరిగాయి. పండుగ పూట పిల్లలంతా బాంబులు పేల్చుతుంటే..భగ్గుమంటున్న ధరలతో సామాన్యులు, పేదలు తమ పిల్లలకు బాంబులు కొనివ్వలేని దుస్థితి. పేల్చటం కంటే ముందే టపాసులు ధరలు 30-50 శాతం పెరిగి భయపెడుతున్నాయి. 100 తోకపటాకులుండే ప్యాకెట్ ధర గతేడాది రూ.25 ఉండేది. నేడూ అదే ధర ఉన్నప్పటికీ అందులో పటాకుల సంఖ్యను మాత్రం 50కి కుదించారు. గతేడాది రూపాయికి నాలుగు తోకపటాకులొస్తే నేడు రెండే ఇస్తున్న పరిస్థితి. పదిపీసులుండే సుతిన్బాంబుల ప్యాకెట్ గతేడాది రూ.60 ఉంటే నేడు రూ.100-రూ.120 వరకు పెరిగింది.
ఉప్పూ, పప్పు, సబ్బులదీ అదే దారి
మొన్నటిదాకా కిలో పల్లి రూ.90కి లభించగా..డీజిల్ భారం వల్ల అది కాస్తా రూ.140కి ఎగబాకింది. అంటే నెల వ్యవధిలో కిలో పల్లి రేటు రూ.50 పెరిగింది. పెసర, కంది పప్పులకు అంత ధర పెట్టి కొనలేమనే ఉద్దేశంతో పేదలు, మధ్యతరగతివారు ఎర్రపప్పుతో గతంలో సరిపుచ్చుకునేవారు. నేడు ఆ ఎర్రపప్పు రేటూ రూ.20 పెరిగి రూ.100 నుంచి రూ.110 పలుకుతూ తినకుండా చేస్తున్నది. పెసర పప్పు నాణ్యతను బట్టి రూ.120 నుంచి రూ.130 వరకు లభిస్తున్నది. ప్రతి సబ్బూ, సర్ఫ్ ప్యాకెట్లపైనా 15 రోజుల వ్యవధిలో రూ. 5 నుంచి రూ.10 పెరిగాయి. 250 గ్రాముల సర్ఫ్ఎక్సల్ ప్యాకెట్ వారం కిందటి వరకూ రూ.26కి లభించగా అది కాస్తా నేడు 32కి పెరిగింది. రూ.29 ఉన్న సంతూర్ సబ్బు రూ.32 అయింది. రవాణా చార్జీలు పెరగడంతో బ్రెడ్డు కంపెనీలు కూడా ఒక్కో ప్యాకెట్పై రూ.5 పెంచేశాయి.
కూరగాయలు, ఆకుకూరల ధరలు పైపైకి
రోజురోజుకీ డీజిల్ రేట్లు పైపైకి పోతున్న నేపథ్యంలో సరుకు రవాణా చార్జీలూ పెరిగి కూరగాయల రేట్లు భగభగ మండిపోతున్నాయి. కేజీ మునగకాయలు హోల్సేల్లోనే కేజీ రూ. 200గా ఉంది. దీంతో సామాన్యులు దానివైపే కన్నెత్తి చూడట్లేదు. సాధారణంగా పచ్చిమిర్చిని ఎక్కువగా వాడరు. దీంతో రేటు తక్కువగా ఉంటుంది. కానీ, ఈసారి దానికి భిన్నంగా హోల్సేల్లోనే కేజీ రూ.40 పలుకుతున్నది. అది బహిరంగ మార్కెట్లోకి వచ్చేసరికి రూ.60 అవుతున్నది. అన్ని కూరల్లో వాడే టమాట కేజీ రూ.40 ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే రూ.60 చొప్పున అమ్ముతున్నారు. తీగలాగే చిక్కుడు పైపైకి ఎగబాకుతూ కేజీ రూ.80 నుంచి రూ.100 పలుకుతున్నది. చివరకు దోసకాయ కూడా 40కి చేరింది. బెండకాయ, గోకరకాయ, క్యారెట్..ఇలా ఏ కూరగాయ చూసినా కేజీకి రూ.40కి తక్కువ లేదు. గతంలో ఆకుకూరలు చాలా తక్కువ ధరకే లభించేవి. లాక్డౌన్ సమయంలోనూ పదికి నాలుగు పాలకూర కట్టలు ఇచ్చిన పరిస్థితి. కానీ, నేడు పదికి రెండే ఇస్తున్నారు. పొన్నగంటికూర, పుంటికూర, బచ్చలకూర ఇలా అన్ని ఆకుకూరలదీ ఇదే పరిస్థితి. దీనికితోడు కట్టల సైజూ తగ్గింది. మార్కెట్కు కొత్తిమీర, పూదీన రావడం కూడా తగ్గింది. రూ.20కి 3 కోతిమీర కట్టలు ఇస్తుండటంతో సామాన్యులు దాన్ని కూరల్లో వేయాలనే ఆలోచన చేయడం లేదు.
బిజినెస్ తగ్గింది..రెండు కొనేటోళ్లు ఒకటే కొంటున్నరు.. : సంతోష్, కిరాణం నిర్వాహకుడు
ఈ పండుగకి బిజినెస్ తగ్గింది. వారం, 15 రోజుల్లోనే అన్ని సరుకుల ధరలు పెరిగాయి. పండుగకి తీసుకుపోయే సరుకుల సంఖ్యా తగ్గింది. రెండు వస్తువులు తీసుకుపో యేవారు..ఒకదానితోనే సరిపెట్టుకుంటున్నారు. ఇట్ల రేట్లు పెరుగుతున్నయి ఎట్ల అమ్మాలి అంటే..ట్యాక్సీలు, డీజిల్ రేట్లు పెరుగుతున్నయి కాబట్టే పెంచుతున్నామని హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు. వినియోగదారులేమో అంత రేటా? అంటూ గునుక్కుంటున్నారు.