Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారి పట్ల అప్రమత్తంగా ఉండండి..
- మనకు నష్టం చేకూర్చేందుకు ప్రయత్నిస్తారు : హుజూరాబాద్ ఫలితం తర్వాత సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు
- మంగళవారం రాత్రి ముఖ్య నేతలతో భేటి...?
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం అధికార టీఆర్ఎస్కు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించారు. ట్రబుల్ షూటర్ హరీశ్రావు... దీన్ని ఒక సవాల్గా తీసుకుని పని చేశారు. అయినా ఫలితం తారుమారవటంతో వారు నైరాశ్యానికి గురైనట్టు తెలిసింది. అందునా 23 వేల పైచిలుకు మెజారిటీతో ఈటల గెలవటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్... ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన అనంతరం పార్టీకి చెందిన 30 మంది ముఖ్య నేతలతో సమావేశమైనట్టు వినికిడి. హుజూరాబాద్ బాధ్యుడైన హరీశ్రావు మధ్యాహ్నం 3గంటలకు సీఎంతో భేటీఅయ్యారు. ఆయన దాదాపు గంట సేపు కేసీఆర్తో చర్చించారు. ఉప ఎన్నిక జరిగిన తీరు, తాము అనుసరించిన వ్యూహం, ఈటలకు వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్, దళిత బంధును అమలు చేస్తామన్నా జనం ఆదరించకపోవటానికి గల కారణాల ను ఆయన విడమరిచి చెప్పారు. ఆ తర్వాత ముఖ్యనేతలను పిలిపించుకుని సీఎం మాట్లాడినట్టు సమాచారం. ఉపఎన్నిక ప్రభావం పార్టీపై కచ్చితంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. అందువల్ల ప్రతి ఒక్కరిపైనా దృష్టి సారించాలని సూచించారు. ఉప ఎన్నిక ఫలితాన్ని ఆసరాగా చేసుకుని... కాంగ్రెస్, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు వలవేసే అవకాశ ముందని ఆయన అభిప్రాయపడ్డారు. అందువల్ల పార్టీలో 'ఆత్మగౌరవం' ఎక్కువగా ఉన్న నేతలపై నిఘా ఉంచాలంటూ కూడా ఆదేశించినట్టు తెలిసింది. ఇలా ఎరకు గురయ్యే వారిలో కొందరు మంత్రులు, కీలక నేతలు కూడా ఉండే అవకాశం లేకపోలేదని సీఎం అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ఇప్పటి నుంచి పార్టీ నేతల కదలికల పట్ల ఒకకన్నేసి ఉంచాలంటూ ఆయన దిశా నిర్దేశం చేశారు. ఉప ఎన్నిక ఫలితాన్ని మరిచిపోయి... ఈనెల 29న వరంగల్లో నిర్వహించబోయే విజయగర్జన సభపై దృష్టి సారించాలంటూ సీఎం సూచించినట్టు తెలిసింది. మరోవైపు హుజూరాబాద్ ఫలితంతో టీఆర్ఎస్ అగ్రనేతలతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో కొంతలో కొంత మార్పు కొట్టొచ్చినట్టు కనిపించింది. ఈక్రమంలో మాతృవియోగంతో బాధపడుతు న్న మంత్రి శ్రీనివాసగౌడ్ను బుధవారం మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, జగదీశ్రెడ్డి, సీనియర్ నేత, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తదితరులు... మహబూబ్నగర్ వెళ్లి పరామర్శించారు. ఇప్పటిదాకా వరి వేస్తే కొనేది లేదంటూ ప్రభుత్వం, మంత్రులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో... అందుకు భిన్నంగా ఎమ్మెల్యే గాదరి కిశోర్... వరి వేయొద్దంటూ మేం రైతుల్ని ఎక్కడా ఒత్తిడి చేయటం లేదు... కేవలం వారిని బతిమాలుకుంటున్నామంటూ బుధవారం వ్యాఖ్యానించటం గమనార్హం.