Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్పత్రికి తరలింపు
- గతంలోనూ పలుమార్లు ఘటనలు..
- పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు
నవతెలంగాణ-కౌడిపల్లి
కల్తీ కల్లు తాగి నలుగురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్నెలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్మకన్నె గ్రామానికి చెందిన సాకలి ఎల్లయ్య, సాకలి గోపాల్, మంగలి సుధాకర్, తుమ్మలపల్లి తాండాకు చెందిన లంబాడి సూర్యనాయక్లు వెల్మకన్నెలోని కల్లు దుకాణంలో బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఒకరొకరుగా కల్లు తాగారు. అనంతరం ఇంటికి వెళ్లిన వారికి ఒక్కసారిగా కాళ్లు, చేతులు వంకర్లు పోవడం జరిగింది. గమనించిన కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్కి ఫోన్ చేశారు. దానిలో కౌడిపల్లిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి వారిని తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అక్కడినుంచి మెదక్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా బాధితుల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. కల్లులో మత్తు పానీయాలు కలుపుతూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినా.. ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కల్లు కల్తీపై కల్లు దుకాణ యజమానిని వివరణ కోరగా.. గ్రామంలో ఎవరికీ ఏమీ కానిది.. ఆ నలుగురికి అలా ఎలా అవుతుందని నిర్లక్ష్యపు సమాధానమిచ్చాడు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు కల్తీ కల్లు దుకాణాలపై దాడులు నిర్వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.