Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటినుంచి మూల్యాంకనం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జరిగిన ప్రథమ సంవత్సరం పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. గతనెల 25 నుంచి ఈనెల 3 వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. మొదటి దశ మూల్యాంకనం ప్రక్రియ శనివారం నుంచి, రెండో దశ ఈనెల 8 నుంచి ప్రారంభమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 13 మూల్యాంకనం కేంద్రాలను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. మొదటి దశలో సంస్కృతం, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, అరబిక్, ఫ్రెంచ్, మరాఠి, ఉర్దూ, మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్, బాటనీ సబ్జెక్టుల మూల్యాంకనం జరుగుతుంది.
రెండోదశలో జువాలజీ, ఫిజిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ, కెమిస్ట్రీ, కామర్స్, జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జీ కోర్సు సబ్జెక్టులకు మూల్యాంకనం చేపడతారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 4,09,897 మంది రెగ్యులర్, 49,331 మంది ఒకేషనల్ కలిపి 4,59,228 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో 1,768 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలు ఈనెల నాలుగో వారంలో విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం తర్వాత బోర్డు అధికారులు విద్యార్థులకు వచ్చిన మార్కులను కంప్యూటర్ ఆధారంగా ప్రాసెస్ చేస్తారు. ఈ ప్రక్రియకు వారం, పది రోజులు పడుతుంది. ఆ తర్వాతే ఫలితాలు విడుదల చేస్తారు.