Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల ఇబ్బందులు గమనించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
ధాన్యం అమ్మేందుకు టోకెన్ల కోసం వచ్చిన రైతులకు టోకెన్లు ఇవ్వడంలో రాజకీయాలు చేయొద్దని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.టోకెన్ల కోసం వేలాది మంది రైతులు క్యూలో నిలుచుంటే 150 నుంచి 200మందికే ఇవ్వడం సరికాదన్నారు.దీంతో కోతకొచ్చిన వరి రాలిపోయే అవకాశం ఉందన్నారు. గతంలో టోకెన్లు ఇచ్చిన అనుభవం ఉన్న అధికారులు ఇప్పుడు రైతులను ఇబ్బందు లకు గురిచేయడం తగదన్నారు. మిల్లుల వద్దకు వచ్చిన ధాన్యం ట్రాక్టర్లకు టోకెన్లు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా పొరుగు జిల్లాల నుంచి ధాన్యం రాకను అదుపు చేయాలన్నారు. అన్ని రైస్ మిల్లుల్లోనూ కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు డి.మల్లేష్, డాక్టర్ గౌతమ్ రెడ్డి, బి.పాండు, ఎం.రవినాయక్, రామ్మూర్తి, అంజద్, ఉదూద్ ఉన్నారు.