Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు మృతి, ఒకరి తీవ్ర గాయాలు
- ఛత్రికనాకలో బొమ్మల తయారీ ఫ్యాక్టరీ వద్ద ఘటన
నవతెలంగాణ-చాంద్రాయణగుట్ట
దీపావళి పండుగ సందర్భంగా టపాసులు కాల్చుతుండగా పేలుడు సంభవించి ఇద్దరు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగింది. ఛత్రినాక ఇన్స్పెక్టర్ జిలానీ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన యువకులు బీరన్ విష్ణు(20), జగన్నాథ్(20) కందికల్గేట్ చిత్రగుప్త ఆలయం పక్కన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ)తో బొమ్మల తయారీ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బొమ్మలకు రంగుల అద్దకం సందర్భంగా లిక్విడ్ రూపంలోని కెమికల్స్ ఫ్యాక్టరీ ముందు ఉన్న గుంతలో పేరుకుపోయింది. దాన్ని వారు పట్టించుకోలేదు. గురువారం రాత్రి దీపావళి పండుగను పురస్కరించుకుని విష్ణు, జగన్నాథ్ ఆ గుంతలో టపాసులు వేసి కాల్చారు. అప్పటికే అందులో కెమికల్స్ ఉండటంతో ఒక్కసారిగా పెద్దగా పేలుడు సంభవించి విష్ణు, జగన్నాథ్ తీవ్రంగా గాయపడిన అక్కడికక్కడే మృతిచెందారు. పక్కనే ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న ఛత్రినాక పోలీసులు, ఫలక్నుమా సీఐ మాజీద్ వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇద్దరి మృతదేహాలను, గాయపడిన వ్యక్తిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. బొమ్మల తయారీ ఫ్యాక్టరీకి పర్మిషన్ లేదని పోలీసులు తెలిపారు.