Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు తీర్పు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
డ్రంక్ అండ్ డ్రైవ్లో మద్యం తాగి వాహనాన్ని నడిపారని చెప్పి, ఆ వాహనాన్ని పోలీసులు సీజ్ లేదా స్వాధీనపర్చుకోవటం సరికాదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ ఇటీవల తీర్పు చెప్పారు. ఆయా వాహనాలను మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద సీజ్ , స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు లేదంటూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో తమ వెహికల్స్ను పోలీసులు సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 40కిపైగా రిట్లను విచారించిన జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం కీలక తీర్పు చెప్పారు. మద్యం సేవించి వాహనాల్ని నడిపేందుకు వీల్లేదు.. ఒకవేళ ఎవరైనా తాగి వాహనం నడిపితే అలాంటి వారి వాహనాన్ని సీజ్ చేయకూడదు. తాగి వాహనం నడిపే వారి పక్కనున్న వాళ్లు తాగకుంటే, వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లయితే వాళ్లకు ఆ వాహనాన్ని అప్పగించాలి. తాగి ఉన్నా లేక పక్క ఎవరూ లేకపోయినా సమీపంలోని వారికి సమాచారం ఇవ్వాలి. అలా వచ్చిన స్నేహితులు, బంధువులకు వాహనాన్ని అప్పగించాలి. రానిపక్షంలో వాహనాన్ని సమీప పీఎస్కు లేదా మరో చోటకు తరలించాలి. మేజిస్ట్రేట్ కోర్టుకు పోలీసులు మూడు పని దినాల్లో కేసును నివేదించాలి. రాష్ట్ర మోటార్ వెహికల్స్ యాక్ట్లోని 448- ఎ రూల్ ప్రకారం పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్లో తాగి వాహనాన్ని నడిపితే సీజ్ లేదా స్వాధీనం చేసుకునే అధికారం లేదు. తామిచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా పోలీసులు చర్యల ఉంటే వాళ్లపై కోర్టుధిక్కార చర్యలు తీసుకోవచ్చు. ఆ విధమైన అభ్యర్థనతో బాధితులు కోర్టులను ఆశ్రయించవచ్చు.. అని కోర్టు తీర్పు చెప్పింది.
హెచ్ఎండీఏకు నోటీసు
ఓఆర్ఆర్ యూజర్ చార్జీల టెండర్ రూల్స్పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన కేసులో వివరణ ఇవ్వాలని హెచ్ఎండీఏకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. సహకార్ గ్లోబల్ లిమిటెడ్ వేసిన రిట్ను శుక్రవారం విచారించింది. రెండు కంపెనీలకు టెండర్ వచ్చేలా హెచ్ఎండీఏ చేస్తోందని, బిడ్స్ వేసేందుకు ఈనెల 8తో గడువు అయిపోతుందని, సర్వేకు గడువు ఇవ్వకుండా చేయడం అన్యాయమని చెప్పింది. విచారణ 8న జరుపుతామని, ఈలోగా హెచ్ఎండీఏ కౌంటర్ వేయాలని ఆదేశించింది.