Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 17 రాష్ట్రాల్లో వ్యాట్ను తగ్గించినా కేసీఆర్కు పట్టదా? : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడానికి టీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రధాన కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరుకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.10 మేరకు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యాట్ను తగ్గించకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. దేశంలోని 17 రాష్ట్రాలు పెట్రోలు, డీజిల్పై ఇప్పటికే విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గించాయనీ, మన సీఎం కేసీఆర్ మాత్రం ఇంతవరకు స్పందించకపోవడం దుర్మార్గమని విమర్శించారు. అధిక వ్యాట్ వల్లనే మన రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రతిరోజూ టీఆర్ఎస్ నాయకులు గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై దుష్ప్రచారం చేసినా ప్రజలు బీజేపీ పక్షానే నిలిచారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ను తగ్గిస్తే తక్కువ ధరకే డీజిల్, పెట్రోల్ వస్తాయని తెలిపారు. ప్రాజెక్టుల పేరిట కోట్ల రూపాయల కమిషన్లను కేసీఆర్ సర్కారు దండుకున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో నేడు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓవైపు భూములను అమ్ముతూ, మరోవైపు మద్యం ద్వారా వచ్చిన ఆదాయంతో రాష్ట్రాన్ని టీఆర్ఎస్ సర్కారు నెట్టుకొస్తున్నదని విమర్శించారు. వంట నూనెలపై ఒక్కో ప్యాకెట్ పై రూ.5 నుంచి రూ.20 వరకు తగ్గించడాన్ని స్వాగతించారు. వంట నూనెలపై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని 32.5 శాతం నుంచి 17.5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.