Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈటలకు వీహెచ్ ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హూజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించినందుకు బీజేపీ నేతలు సంకలు గుద్దుకుంటుందని మాజీ ఎంపీ వి హనుమంతరావు విమర్శించారు. నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలని ఎమ్మెల్యే ఈటలను డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలను తగ్గించడానికి ఏం చేస్తారో చెప్పాలని నిలదీశారు. శుక్రవారం గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఉప ఎన్నిక ఓటమితోనైనా సీఎం కేసీఆర్ ప్రతిపక్షాల సూచనలు పట్టించుకోవాలని అన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలుపుకుని పోవాలని రేవంత్కు సూచించారు. కోమటిరెడ్డి బ్రదర్స్తో మాట్లాడే బాధ్యతను పార్టీ తనకు అప్పగించిందని చెప్పారు.
వరి రైతులను పట్టించుకోవాలి : మల్లు రవి
వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కారణంగా ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యమవుతున్నదని విమర్శించారు. రైతుల నుంచి వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేసి, వారి ఆదుకోవాలని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలు అమ్ముకోవడానికి రైతులు నానాకష్టాలు పడాల్సివస్తున్నదని చెప్పారు. ఇప్పటికైనా రెండు ప్రభుత్వాలు తప్పించుకునే ధోరణి విడనాడాలనీ, రైతుల నుంచి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు.