Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు పార్టీల నాయకుల సంఘీభావం
- సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ
నవతెలంగాణ-కాజీపేట
కాజీపేట రైల్వే క్రూ లింక్లు విజయవాడకు తరలించడంతో పాటు గతంలో విజయవాడకు తరలిపోయిన క్రూ డిపోనూ వెంటనే వరంగల్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేయాలని స్థానిక క్రూ ఎదుట శుక్రవారం రైల్వే కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన నిరసన కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్, ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్ సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఉత్తర, దకిణ భారతదేశానికి వారధిలా ఉన్న కాజీపేట రైల్వే జంక్షన్ నిలుస్తోందన్నారు. ఈ క్రూ డిపో నుంచి పలు లింకులు విజయవాడకి తరలిపోకుండా రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడతామని తెలిపారు. రైల్వే ప్రయివేటీకరణ జరగకుండా కార్మికులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కయ్య మాట్లాడుతూ.. తొలగించిన 4 లింకులను తిరిగి వెంటనే కాజీపేటకు కేటాయించాలని డిమాండ్ చేశారు. 2007, 2011లలో కూడా కాజీపేట జంక్షన్ క్రు లింకులను విజయవాడకు తరలించాలని సన్నాహాలు చేశారనీ, కానీ రైల్వే కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో ఉపసంహరించుకున్నారని గుర్తుచేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులు ధర్మారావు మాట్లాడుతూ.. నిజాం కాలం నుంచి ఉత్తర, దక్షిణ భారతదేశానికి వారధిలా ఉన్న కాజీపేటకు పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. కెేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారంతో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. రద్దు చేసిన రైళ్ళను వెంటనే పునర్ ప్రారంభించాలనీ, క్రూ డిపో తరలింపును అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. రైల్వే ప్రయివేటీకరణ ఆపడానికి కార్మికులందరూ ఏకం కావాలన్నారు. అవసరమైతే కార్మికుల పక్షాన పోరాడటానికి కాంగ్రెస్ ఎంపీలను కాజీపేటకు తీసుకొచ్చి నిరసన చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, విజయశ్రీ రాజలి, సంకు నర్సింగ్, రైల్వే సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.