Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయుల శాశ్వత కేటాయింపులు ఆలస్యం
- జీఏడీ ఉత్తర్వుల జారీ కాకపోవడమే కారణం
- హెచ్ఎంలు మధ్యాహ్న భోజనం తినాల్సిందే
- మార్గదర్శకాలు కఠినతరం చేయనున్న విద్యాశాఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రక్రియకు బ్రేక్ పడింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో అది అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం 2016, అక్టోబర్ 11న రాష్ట్రంలోని 10 జిల్లాలను 31 జిల్లాలకు పెంచింది. ఉమ్మడి జిల్లాల్లో పనిచేసిన ఉద్యోగులను ఆర్డర్ టు సర్వ్ పేరుతో కొత్త జిల్లాలకు బదిలీ చేసింది. ఆరునెలల్లోపు శాశ్వత కేటాయింపులు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2019, ఫిబ్రవరి 18న నారాయణపేట, ములుగు రెండు కొత్త జిల్లాలు ఆవిర్భవించాయి. దీంతో జిల్లాల సంఖ్య 33కు చేరింది. ఆ రెండు జిల్లాలను చేర్చుతూ రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులను 2021, ఏప్రిల్ 21న కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. స్థానికత ఆధారంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు శాశ్వతంగా కేటాయించేందుకు ఈ ఏడాది ఆగస్టు 8న రాష్ట్ర ప్రభుత్వం 84 ఉత్తర్వులను విడుదల చేసింది. అందుకనుగుణంగా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) మార్గదర్శకాలను రూపొందిస్తున్నది. వీటితోపాటే బడులు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రక్రియను సమాంతరంగా చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అయితే దీనికి వీలుగా జీవోనెంబర్ 25ను ఈ ఏడాది ఆగస్టు 17న విద్యాశాఖ విడుదల చేసింది. 2020-21 విద్యాసంవత్సరంలోని గణాంకాల ఆధారంగా హేతుబద్ధీకరణ చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. జీఏడీ నుంచి ఉద్యోగుల శాశ్వత కేటాయింపుల ఉత్తర్వులు విడుదలైతేనే ఆ ప్రక్రియను చేపట్టేందుకు వీలవుతుంది. ఆ ఉత్తర్వులు విడుదలయ్యేందుకు ఆలస్యమవుతుందని విశ్వసనీయంగా తెలిసింది. దీంతో హేతుబద్ధీకరణ ప్రక్రియ ప్రస్తుత విద్యాసంవత్సరంలో లేనట్టేనని ఉపాధ్యాయ సంఘాలు భావిస్తున్నాయి. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు స్థానికంగా మార్పులు చేర్పులు చేసుకునేందుకు డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం అధికారం ఇచ్చినట్టు తెలిసింది. అయినా ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
బడుల బాగుకు రూ.2 వేల కోట్లు
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల బాగు కోసం ప్రస్తుత విద్యాసంవత్సరంలో రూ.2 వేల కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు, పథకం పేరును వచ్చే మంత్రివర్గంలో చర్చించి ఆమోదించే అవకాశమున్నది. ఆ తర్వాత నిధులను ప్రభుత్వం విడుదల చేయనున్నట్టు తెలిసింది.
ఈ పథకానికి ఎమ్మెల్యేల నిధుల్లో 25 శాతం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కసరత్తును ఆర్థిక శాఖ అధికారులు చేస్తున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ బాధ్యత పూర్తిగా హెడ్మాస్టర్ల (హెచ్ఎం)దేనని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేస్తున్నది. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనీ, హెచ్ఎంలు రోజూ విద్యార్థులతోపాటు భోజనం చేయాలని నిబంధన విధించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కఠినతరం చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.