Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జావిద్ డిమాండ్
- ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ కార్యాలయం ముట్టడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మేడ్చల్ ప్రభుత్వ ఐటీఐ కాలేజీని అక్కడి నుంచి తరలించేందుకు ఇద్దరు మంత్రులు కుట్ర పన్నుతున్నారని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండీ జావిద్ విమర్శించారు. ఆ భూమిని కాజేసేందుకు వారు చూస్తున్నారని చెప్పారు. ఆ కాలేజీని అక్కడి నుంచి తరలించొద్దనీ, పేద విద్యార్థులకు అన్యాయం చేయొద్దని కోరారు.
ఇదే డిమాండ్పై ఉపాధి కల్పన, శిక్షణ శాఖ సంచాలకుల కార్యాలయాన్ని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ముట్టడించారు. ఈ సందర్భంగా జావిద్ మాట్లాడుతూ ఆ కాలేజీ భూమిని కాజేయాలని మంత్రులు కుట్ర చేస్తున్నా అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను సంరక్షించాల్సిన మంత్రులే కాలేజీని తరలిస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు. అవసరమైతే మంత్రి మల్లారెడ్డి ఇంటిని ముట్టడిస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పడాల శంకర్, నాయకులు వెంకటేష్, కాసీంతోపాటు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఆ కాలేజీ తరలింపునకు అనుమతివ్వం : జాయింట్ డైరెక్టర్
మేడ్చల్ ప్రభుత్వ ఐటీఐ కాలేజీ తరలింపునకు అనుమతి ఇవ్వబోమని ఉపాధి కల్పన, శిక్షణ శాఖ జాయింట్ డైరెక్టర్ కెవి నగేష్ హామీ ఇచ్చారు. ఆ భూములను ఎవరికీ ఇవ్వబోమని స్పష్టం చేశారు.
ఆ కాలేజీకి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ మంజూరు కాబోతున్నదని వివరించారు. ఆ కాలేజీని అభివృద్ధి చేస్తాం తప్ప ఎవరికీ ధారాదత్తం చేయబోమని ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులకు హామీ ఇచ్చారు.