Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయన రాజీనామాను తిరస్కరిస్తే ఇంకా బాగుండేది...
- రెచ్చగొట్టాం.. ఇబ్బందుల్లో పడ్డాం...
- సీఎం సభ నిర్వహించి ఉంటే మెజారిటీ తగ్గేదేమో...?
- టీఆర్ ఎస్ మంత్రులు, సీనియర్ల అంతర్మథనం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం ఇచ్చిన షాక్ నుంచి అధికార టీఆర్ఎస్ నేతలు ఇప్పట్లో కోలుకునేలా లేరు. దీనిపై వారిలో అంతర్మథనం మొదలైంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ను మాటి మాటికీ గెలక్కుండా, ఆయన మానాన ఆయన్ని వదిలేస్తే బాగుండేదనే అభిప్రాయం ఇప్పుడు ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసినా... ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి ఆయన చేసిన రాజీనామాను ఆమోదించకుండా... తిరిస్కరించి ఉంటే పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదని నేతలు భావిస్తున్నారు. ఆయన్ను క్యాబినెట్ నుంచి తొలగించగానే... ఈటలకు అన్యాయం చేశారంటూ హుజూరాబాద్ జనాలు సానుభూతిని వ్యక్తం చేస్తూ వచ్చారనీ, చివరిదాకా అది అలాగే కొనసాగిందనే అంచనాకు గులాబీ పార్టీ వచ్చింది. అలాంటప్పుడు ఆయన్ను మాటి మాటికి విమర్శించకుండా, ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించకుండా ఉండి ఉంటే... జనం కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోక పోయేవారు. దాంతో ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారకుండా, సాధారణంగా జరిగిపోయేది. అప్పుడు ఇటు ప్రజల్లోనూ, అటు మీడియాలోనూ ఇంత సంచలనం కాకుండా ఉండేదనే వాదన ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచే వ్యక్తమవుతుండటం గమనార్హం. ఈటల రాజీనామా చేసిన దగ్గర్నుంచి... ఎన్నిక వరకూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్లు ఇలా అందరూ కట్టకట్టుకుని, హుజూరాబాద్లో తిష్టేయటం కూడా ప్రతికూలంగా మారిందంటూ వారిప్పుడు వాపోతున్నారు. మరోవైపు ఎన్నికల సంఘం ఆదేశాలతో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించకపోవటం కూడా మైనస్గా మారిందనీ, ఒకవేళ ఆయన సభ జరిగి ఉంటే... ఈటల మెజారిటీ చాలా వరకూ తగ్గేదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ట్రబుల్ షూటర్ హరీశ్రావు బాధ్యత మొత్తాన్ని భుజాన మోసినా... మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ సైతం కాలుకి బలపం కట్టుకుని తిరిగినా ఫలితం దక్కలేదని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జనం హ్యాండిచ్చారు...
ఉప ఎన్నిక ప్రచారానికి సంబంధించి మొదటి నుంచి జనం... టీఆర్ఎస్ను అమి తంగా ఆదరించారనీ, అయితే ఓట్లదగ్గర కొచ్చే సరికి వారు హ్యాండిచ్చారని ప్రచారంలో కీలకంగా పాల్గొన్న నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. కుల, మత సంఘాల మీటింగులన్నింటికీ ప్రజలు తండోపతండాలుగా వచ్చారనీ, ఓటేస్తామంటూ హామీ ఇచ్చి... పుట్టి ముంచారని చెప్పారు. 'హుజూరాబాద్ జనాలు... ఏమి హుషారున్నరు...' అంటూ ముక్తాయింపునిచ్చారు.
త్వరలోనే కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ...?
హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన సీనియర్ నేత పాడి కౌశిక్రెడ్డి పరిస్థితి ఇప్పుడు డోలాయమానంలో పడింది. ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవినివ్వటం ద్వారా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో లబ్ది పొందేందుకు కారు పార్టీ ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆయన ద్వారా కాంగ్రెస్ వెనకున్న ఓట్లను ఎక్కువగా రాబట్టుకోవటంలో ఆ పార్టీ సఫలీకృతమైనా గెలుపును మాత్రం సాధించలేక పోయింది. ఈ నేపథ్యంలో కౌశిక్రెడ్డికి ఎమ్మెల్సీ పదవినిస్తారా..? ఇవ్వరా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆయనకు త్వరలోనే ఆ పదవి రావటం ఖాయమనీ, సీఎం కేసీఆర్ను నుంచి ఈ మేరకు సూచనలొచ్చాయని ఓ మంత్రి వ్యాఖ్యానించటం గమనార్హం.