Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిల్వలున్నా వ్యాక్సినేషన్కు ముందుకు రాని జనం
- అవగాహన కల్పించటంలో సర్కారు విఫలం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా వ్యాక్సిన్ వేయటం ప్రారంభించి దాదాపు 10 నెలలు కావస్తున్నా అనుకున్న స్థాయి లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. రోజుకు ఐదు లక్షల మందికి పైగా వేస్తూ 15 రోజుల్లో కోటి మంది చొప్పున ఇవ్వాలనుకున్నప్పటికీ సాధ్యం కాలేదు. కరోనా మొదటి వేవ్ నుంచి సేవలందిస్తున్న పరిమిత సిబ్బందితోనే పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు వేయాలని సర్కారు తీసుకున్న నిర్ణయం ఆచరణలో విఫలమవుతున్నది. కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలు సైతం సకాలంలో వ్యాక్సిన్ తీసుకోవటానికి మునపటిలా ఆసక్తి చూపించటం లేదు. అదే సమయంలో ప్రజల్లో పెరిగిన నిర్లక్ష్యాన్ని తొలగించేందుకు తగిన ప్రచార కార్యక్రమాలు నిర్వహించకుండా ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నది. ప్రతి రోజూ 10 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చే సామర్థ్యం తమకుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటిస్తున్నా, వేలాది సంఖ్యలో డోసులు నిల్వ ఉన్నా ప్రతి రోజూ మొదటి డోసు, రెండో డోసు కలిపి కూడా మూడు లక్షల మందికి మించి తీసుకోవటం లేదు.
రాష్ట్రంలో 18 ఏండ్లు పైబడిన 2.77 కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సిన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కోవాగ్జిన్, కోవిషీల్డ్ డోసులను ఇస్తున్నారు. ఈ ఏడాది జనవరి 16న కరోనా వారియర్లతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. మొదట్లో వ్యాక్సిన్ పట్ల ఉన్న అపోహలు, భయాలతో పాటు వ్యాక్సిన్ డోసులు అనుకున్న స్థాయిలో అందుబాటులో లేకపోవటంతో పరిమిత సంఖ్యలోనే ఇచ్చారు. ఆ తర్వాత వ్యాక్సిన్ల ఉత్పత్తి, సరఫరా పెరగటంతో కేంద్రం నుంచి కూడా ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో డోసులు వస్తున్నారు. అయితే పంపించిన వ్యాక్సిన్లను వెంటనే ఉపయోగించుకుంటే మరిన్ని వ్యాక్సిన్లు వచ్చే అవకాశముంది. కాని అవే నిల్వ ఉండటంతో పరిస్థితి భిన్నంగా మారింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,14,09,836 డోసులను వినియోగించారు. ఇందులో 2,20,14,107 మంది మొదటి డోసు తీసుకోగా, వారిలో 93,95,729 మంది మాత్రమే రెండో డోసు తీసుకున్నారు. అంటే 1,26,18,378 మంది రెండో డోసు తీసుకోవాల్సిన వారున్నారు. వీరిలో చాలా మందికి రెండో డోసు గడువు వచ్చినప్పటికీ టీకా తీసుకోవటం లేదు. మరో 50 లక్షల మందికి పైగా ప్రజలు ఇప్పటి వరకు ఒక్క డోసు కూడా తీసుకోని వారున్నారు.
ఎందుకిలా?
ప్రజల్లో శాస్త్రీయ అవగాహన లేకపోవటం, వ్యాక్సిన్ పట్ల వెల్లువెత్తుతున్నవదంతులను, ప్రజల్లో ఉన్న భయాలను తొలగించడంలో సర్కారు వైఫల్య కనబడుతున్నది. ఇంటింటికి వ్యాక్సిన్ వంటి ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నా...వ్యాక్సిన్ వేసుకోవద్దని నిర్ణయించుకున్న వారికి అవగాహన కల్పించే కార్యక్రమాలను మాత్రం చేపట్టటం లేదు. దీంతో వ్యాక్సిన్ తో వచ్చే సిబ్బందిని చూసి కొన్ని ప్రాంతాల్లో జనం పారిపోతున్న వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 60 శాతం ఒక్క డోసు టీకా తీసుకోని వారున్నారు. 30 శాతం మంది ఒక్క డోసు మాత్రమే తీసుకున్నారు. రెండు డోసుల టీకా తీసుకున్న వారు కేవలం 10 శాతానికే పరిమితమయ్యారు. దీంతో వ్యాక్సిన్ కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుతుందనే విషయం స్పష్టమైనా..... ఆ అవగాహనను ప్రజల వద్దకు చేర్చేందుకు తగిన కార్యాచరణ చేపట్టడంలో మాత్రం సర్కారు విఫలమైంది. ఈ తాత్సారం అనర్థానికి దారి తీయకముందే ప్రభుత్వం మేల్కొనాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.