Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ హక్కుల గుర్తింపు చట్టంపై 13న సెమినార్
- విస్తృతంగా దరఖాస్తులు స్వీకరించాలి
- నేడు గవర్నర్కు వినతి
- పోడు రైతు పోరాట కమిటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అటవీ హక్కుల గుర్తింపు చట్టంపై ఈ నెల 13న రాష్ట్ర స్థాయి సెమినార్ను హైదరాబాద్లో నిర్వహించనున్నట్టు పోడు రైతుల పోరాట కమిటీ తెలిపింది. అదే విధంగా శనివారం పోడు రైతులు సమస్యలపై గవర్నర్కు వినతి పత్రం ఇవ్వనున్నామని వివరించింది. శుక్రవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పోడు రైతుల పోరాట రాష్ట్ర స్టీరింగ్ కమిటి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆ పార్టీ రాష్ట్ర నాయకులు బండారు రవికుమార్, కాంగ్రెస్ నాయకులు భవానీ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్రెడ్డి, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.వెంకటేశ్వరరావు, నాయకులు కె గోవర్దన్, సీపీఐ(ఎంఎల్ ఎన్డీ) నాయకులు కె రమ, జె చలపతిరావు, రైతు స్వరాజ్య వేదిక నాయకులు కె రవి, టీజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్, తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి ఆర్ అంజయ్య నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టం ద్వారానే రైతులకు పోడు హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర స్థాయిలో ఒకే నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. చట్టాన్ని హడావుడిగా అమలు చేస, సాగు దారులకు అన్యాయం చేస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. పోడు సమస్య ఉన్న అన్ని గ్రామాలు, ఆవాసాల్లో అటవీ హక్కుల గుర్తింపు చట్టం కమిటీలు వేయాలని కోరారు. విస్తతంగా దరఖాస్తులను స్వీకరించాలని డిమాండ్ చేశారు. అటవీశాఖ జోక్యం లేకుండా గిరిజన సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగానే చట్టాన్ని అమలు చేయాలనీ, దాని అమల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపారు. సుదీర్ఘ కాలంగా ఆదివాసీ ప్రజలు, మరీ ముఖ్యంగా సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 5 వరకు ఆదివాసీలు, గిరిజనులు ఉమ్మడిగా పోరాడటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం పోడు రైతులకు పట్టాలు ఇవ్వడానికి ముందుకు వచ్చిందని వివరించారు. ఫారెస్ట్ అధికారుల,పోలీసుల దాడులు కూడా తగ్గాయని తెలిపారు. అయితే సీఎం విడుదల చేసిన ప్రకటనతోపాటు, మంత్రులు, కొందరు జిల్లా కలెక్టర్లు చెబుతున్న మాటలు చూస్తుంటే.. అటవీ హక్కుల చట్టం స్ఫూర్తికి భిన్నంగా ఉన్నాయన్నారు.ఆ చట్టం స్ఫూర్తిని అమలు చేయడానికి ప్రభుత్వాలు పూనుకోవాలని, వెంటనే అందుకు రాతపూర్వక మార్గదర్శకాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ జోక్యం, అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల జోక్యం లేకుండా, చట్టం చెప్పినట్టుగా గ్రామ సభలు ఏర్పాటు చేసి అటవీ హక్కుల కమిటీలను వెంటనే ఎన్నుకోవాలని సూచించారు. ఆ కమిటీలకు మాత్రమే పోడు రైతుల నుంచి వ్యక్తిగత, సామూహిక పట్టాల కోసం దరఖాస్తులు తీసుకోవాలని కోరారు. 2005 డిసెంబర్ 13 నాటికి పోడు చేసుకుంటున్న ఆదివాసీలకు,గిరిజనులకు వెంటనే పట్టాలు ఇచ్చేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. దరఖాస్తులు తీసుకోవడానికి నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకూ గడువు విధించడం చట్ట వ్యతిరేకమని చెప్పారు. చట్టం ప్రకారం మొదటి దశలో మూడు నెలలకు పొడిగించాలనీ, ఈ లోపు అన్ని ప్రాంతాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి కమిటీలను ఎన్నుకోవాలనీ, వాటి ఆధ్వర్యంలోనే దరఖాస్తులు స్వీకరించాలన్నారు. చట్టం అమలు తీరుపై ఆదివాసీలకు,గిరిజనులకు అవగాహన కల్పించేలా రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించడానికి వీలుగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టాలని కోరారు. పోడు రైతుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో శనివారం గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్, సీఎస్లకు వినతి పత్రాలు ఇవ్వనున్నట్టు తెలిపారు.ఈ నెల 13 న హైదరాబాద్లో అటవీ హక్కుల గుర్తింపు చట్టం పై రాష్ట్రస్థాయి సెమినార్ను నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందులో న్యాయవాదులు పల్లా త్రినాథరావు, భూమి సునీల్, పరిశోధకులు, మహిళా రైతుల హక్కుల వేదిక నాయకులు ఉషా సీతా లక్ష్మి, మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మిడియం బాబూరావు పాల్గొంటారని చెప్పారు. అన్ని ఐటీడీఏలు, జిల్లాల పరిధిలో కూడాి సదస్సులు నిర్వహిం చి ఆదివాసీ ప్రాంతాల కార్యకర్తలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు.