Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నేతలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్న
- ఉన్నత వర్గాల సేవలో తరిస్తున్న కమలం పార్టీ
- పబ్లిక్ సెక్టార్ను అంబానీ, ఆదానీలకు కట్టబెడుతున్నారు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని మోడీ సర్కార్... ప్రభుత్వ రంగాన్ని నానాటికీ ధ్వంసం చేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, మైనారిటీల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. పబ్లిక్ సెక్టార్ పూర్తిగా నిర్వీర్యమైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ఉండబోవని హెచ్చరించారు. ప్రయివేటు రంగంలో వీటిని అమలు చేయబోరని అన్నారు. ఇలాంటి వాస్తవాలను మరిచి... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు, ఎంపీ అరవింద్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లను బీజేపీ అమలు చేయించగలదా..? అని ఆయన ప్రశ్నించారు. తన ప్రశ్నకు బండి సంజరు, అరవింద్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం హైదరాబాద్లోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్రావుతో కలిసి మంత్రి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి... ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని విమర్శించారు. అయినా ఆ పార్టీ నేతలు వాస్తవాలను గుర్తెరగటం లేదన్నారు. తమది ప్రజల కోసం పని చేస్తున్న ప్రభుత్వమని చెప్పారు. బీజేపీ మాత్రం ఉన్నత వర్గాల కోసమే పని చేస్తున్నదని అన్నారు. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ అంబానీ, ఆదానీలకు కట్టబెడుతున్నదని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలోని బీజేపీ నేతలు దళిత బంధును ఆపాలంటూ ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు, ఆ తర్వాత దాన్ని నిలుపుదల చేయించారు.. ఇప్పుడేమో తక్షణమే ఆ పథకాన్ని అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు... ఇది దుర్మార్గం కాదా..? అని ప్రశ్నించారు. ధాన్యాన్ని కొనుగోలు చేయబోమంటూ కేంద్రంలోని బీజేపీయే చెప్పింది... ఆ మేరకు రాష్ట్రాలకు లేఖలు రాసింది, కానీ అదే పార్టీకి చెందిన నేతలు ఇక్కడ ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ దీక్షలు చేశారు, ఇదీ ఆ పార్టీ నిజస్వరూపమని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి ఈటల ముందు... తమ పథకాలు, కార్యక్రమాలేవీ పనిచేయలేదని కొప్పుల ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అక్కడ బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయనీ, అయినా తమ ఓటు బ్యాంకు ఎక్కడా చెదిరిపోలేదని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ గెలవగానే... రాష్ట్రమంతా తిరుగుతా... మంత్రుల నియోజకవర్గాల్లో పర్యటిస్తానంటూ మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్రంలో ఎవరైనా, ఎక్కడైనా తిరగొచ్చనీ, అయితే బ్లాక్మెయిల్కు పాల్పడటం మంచిది కాదని హితవు పలికారు. బీజేపీలో ఈటల తనకు తాను పెద్ద నాయకుడిగా ఊహించుకుంటున్నారనీ, అలాంటప్పుడు మాజీ ఎమ్మెల్యే లక్ష్మన్, ఎంపీలు బండి సంజరు, అరవింద్, కేంద్ర హోం మంత్రి కిషన్రెడ్డి ఏం కావాలని ప్రశ్నించారు. ఇప్పటిదాకా పెట్రోల్, డీజిల్ ధరలను రూ.115 వరకు పెంచి, ఇప్పుడు రూ.5 తగ్గించటం పెద్ద జోకంటూ ఆయన కొట్టిపారేశారు.