Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఆర్టీసీలో వృధా ఖర్చులు
- చైర్మెన్ మారినప్పుడల్లా కొత్త కార్ల కొనుగోలు
- సొంత కార్లకూ బిల్లుల వసూళ్లు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
''టీఎస్ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఎంతకాలమని ప్రభుత్వం ఆదుకుంటుంది. ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలి. లేకుంటే భవిష్యత్ కష్టం'' రెండేండ్ల క్రితం జరిగిన 55 రోజుల ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలు, ఇప్పటి వరకు ప్రభుత్వం చెప్తున్న మాట ఇదే. ఇదే స్టాండ్తో హైకోర్టులో పలురకాల అఫిడవిట్లు కూడా ప్రభుత్వం దాఖలు చేసింది. ఆర్టీసీకి తాము చాలా ఇచ్చామని ప్రచారం చేసుకుంది. అసలు ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి ఎంత రావాలి అనే అంశంపై మాత్రం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. సరే..ఇదంతా 'సశేషం' కతే! తాజాగా ఆర్టీసీకి ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ను మేనేజింగ్ డైరెక్టర్గా, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ను చైర్మెన్గా ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎమ్డీ సజ్జనార్ ఆర్టీసీపై తన మార్కు ఉండేలా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దశాబ్దాలుగా పండుగ సీజన్లలో ప్రయాణీకులపై వేస్తున్న 50 శాతం అదనపు బాదుడును రద్దు చేసి, ఆయన ప్రయాణీకుల మన్నన చూరగొన్నారు. అలాగే ఖర్చుల్ని నియంత్రించే చర్యలకూ శ్రీకారం చుట్టారు. తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిని విరాళాల ద్వారా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి రూపాయికీ లెక్క తేలాల్సిందేనని అధికారుల్ని ఆదేశిస్తున్నారు. అంతా సక్రమంగానే జరుగుతుంది అనుకుంటున్న సమయంలో కొందరి అత్యాశ, అత్యుత్సాహం ఆర్టీసీని మళ్లీ నవ్వులపాలు చేస్తుంది. టీఎస్ఆర్టీసీకి తొలి చైర్మెన్గా నియమితులైన సోమారపు సత్యనారాయణ నాలుగేండ్ల క్రితం రూ.27 లక్షలు ఖర్చు పెట్టి, ఇన్నోవా కారును కొనుగోలు చేశారు. సరే...కొత్త రాష్ట్రం...కొత్త చైర్మెన్ కాబట్టి ఆ హౌదాలో ఆయనకు ఆ కారు అవసరం అనుకున్నారు అందరూ. రెండేండ్లు కాగానే ఆయన పదవీకాలం ముగిసి వెళ్లిపోయారు. అప్పటి నుంచీ ఆయన కారు బస్భవన్లో అలాగే పక్కన పెట్టి ఉంది. తాజాగా ఇటీవల ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ను చైర్మెన్గా ప్రభుత్వం నియమించింది. ఆయన రాగానే కొత్త కారు కావాలని కోరడం, రూ.37 లక్షలు పెట్టి కియా కార్నివాల్ కారును కొనుగోలు చేయడం జరిగిపోయాయి. మరి పాత చైర్మెన్ రూ.27 లక్షలు పెట్టి కొన్న కారు సంగతేంటి సారూ...అంటే అధికారులు ఎవరూ సప్పుడు చేయట్లేదు. ఈ కార్ల కొనుగోలుపై బస్భవన్లోని ఉద్యోగుల మధ్య చర్చ జరుగుతున్నది. ఇదే విషయంపై అక్కడి ఓ అధికారిని అడిగితే...''అవును...కొత్త కారు కొన్నారు...ఎందుకు కొన్నారు అని ఎవరు... ఎవర్ని అడగాలి'' అని ఎదురు ప్రశ్నించారు. ''మీకు ఆ కారు ఒక్కటే కనిపిస్తున్నది. మా దగ్గర డిపో మేనేజర్లు మొదలు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల వరకు సొంత కార్లను కిరాయికి తీసుకొని తిరుగుతున్నట్టు బిల్లులు వసూళ్లు చేసుకుంటున్నారు. మరి కొందరైతే బినామీ పేర్లతో బస్సుల్ని కూడా ఆర్టీసీకి అద్దెకు ఇచ్చి నడిపిస్తున్నారు. ఇవేవీ ఎవరికీ కనిపించట్లేదు'' అని నిష్ఠూరాలాడుతున్నారు. ''కొత్త రాష్ట్రం వచ్చాక..ముఖ్యమంత్రి కాన్వారు నలుపురంగులో ఉంటే, సెంటిమెంట్గా ఆ రంగు వద్దని, అవే పాతకార్లకు తెలుపురంగు వేసి తిరుగుతుంటే...ధనికరాష్ట్ర ముఖ్యమంత్రి పిసినారి'' అంటూ అప్పటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వ్యాఖ్యానించారని సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో చెప్పిన మాటల్ని బస్భవన్ ఉద్యోగులు గుర్తుచేసుకుంటున్నారు. సంస్థ ఎమ్డీ ఓసారి ఇలాంటి అనవసరపు వ్యయాలపై దృష్టిసారిస్తే, పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అవడమే కాకుండా, అదాయంగా కూడా మారుతుందని సూచిస్తున్నారు.