Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లగొండ జిల్లాలో కొత్త నిబంధన
- టోకెన్ కోసం తెల్లవారుజాము నుంచే బారులు
నవతెలంగాణ - నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
యాసంగిలో వరి సాగు చేయొద్దంటున్న ప్రభుత్వం.. ఇప్పటి నుంచే రైతులను తిప్పలు పెడుతోంది. వరి కోతలు మొదలై నెల రోజులవుతున్నా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. పైగా ఆంక్షల పేరుతో అన్నదాతలను ఇబ్బందులు పెడుతోంది. గతంలో పంట అమ్ముకునేందుకు ఇబ్బందులు పడిన రైతులు.. ఇప్పుడు పంట కోయాలన్నా గోస పడాల్సి వస్తోంది. ఎన్నడూ లేనిది పొలంలో చేతికొచ్చిన పైరును కోయాలన్నా టోకెన్ ఉండాల్సిందేనంట. అధికారుల నుంచి టోకెన్ తీసుకున్న రైతులే వరి కోతలు కోయాలని నిబంధనలు పెట్టింది. ఆకాశం మేఘావృతం కావడం.. అకాల వర్షాల నేపథ్యంలో ఎక్కడ ఆలస్యమైతే పంట చేతికందకుండా పోతుందోనని రైతులు టోకెన్ల కోసం తెల్లవారుజాము నుంచే బారులు తీరుతున్నారు. మరోవైపు ధాన్యాన్ని అమ్ముకుందామంటూ మిల్లులు తీయడం లేదు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 లక్షల ఎకరాలకు పైగా వరి సాగైంది. అందులో 5లక్షల ఎకరాల్లో సన్నరకం ధాన్యం సాగు చేయగా.. 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అధికారులు అంచనా వేశారు. దొడ్డు రకం ధాన్యాన్ని ఐకేపీ, పీఏసీఎస్, మార్కెటింగ్ శాఖ అధికారులు కొనుగోలు చేస్తుండగా, సన్నరకం మాత్రం నేరుగా రైస్ మిల్లుల యజమానులే కొనుగోలు చేస్తుంటారు. అధికారులే నేరుగా అక్కడికి పంపిస్తుంటారు.
టోకెన్ల కోసం బారులు
రైతులంతా ఒకేసారి వరి కోతలు కోయడంతో మిల్లుల వద్ద ధాన్యం ట్రాక్టర్లతో జమ అవుతున్నారు. దీంతో విక్రయాలు ఆలస్యమవుతున్నాయి. ఈ క్రమంలో జిల్లా అధికార యంత్రాంగం టోకెన్ల విధానం అమల్లోకి తీసుకొచ్చారు. టోకెన్ తీసుకున్నాకే వరి కోత కోయాలని చెబుతున్నారు. టోకెన్ తీసుకున్న రైతుకు ధాన్యం తీసుకురావాల్సిన తేదీ, రైస్ మిల్లు పేరు రాసిస్తారు. రైతు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడికే తీసుకుపోవాల్సి ఉంటుంది. అయితే, ఈ టోకెన్ల కోసం రైతులు పండుగ .. పబ్బం లేకుండా తిరుగుతున్నారు. గ్రామాల్లోని రైతు వేదికల వద్ద వందల సంఖ్యలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. శుక్రవారం నల్లగొండ జిల్లా వేములపల్లి వద్ద సుమారు 1000 మంది రైతులు టోకెన్ల కోసం బారులు తీరారు. అధికారులు వారికి కనీసం మంచినీటి సదుపాయం కూడా కల్పించలేదు. దాంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో రైతులందరికీ టోకెన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు రాస్తారోకో చేశారు.
వరి కోసేందుకు టోకెన్లా..
రైతు పండించిన పంటను అమ్ముకునేందుకు ఫలానా మిల్లుకు వెళ్లేందుకు అధికారులు టోకెన్లు జారీ చేస్తారు. కానీ నల్లగొండ జిల్లా వేములపల్లి మిల్లుల్లో ఇబ్బంది అవుతుందని చెప్పి అధికారులు వరి పంట కోసేందుకూ టోకెన్లు జారీ చేస్తున్నారు. అంటే ఓ రైతుకు నాలుగు ఎకరాల పొలం ఉంటే మూడు ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తరలించాల్సి ఉంటుంది. కానీ అధికారులు ఇచ్చే టోకెన్తో రెండు ట్రాక్టర్ల ధాన్యానికి మాత్రమే అనుమతి ఉంటుంది. అంటే రైతు ఇంకో ట్రాక్టర్ లోడ్ కోసం మరో వారం రోజులు ఆగాల్సిందే. ఈ మధ్యలో వర్షం వస్తే.. ధాన్యం తడిచి నష్టపోవాల్సి వస్తుంది.
మిల్లులు నడవకపోవడంతో సమస్య
మిర్యాలగూడ ఏరియాలో ఉన్న రైస్ మిల్లులు పూర్తి స్థాయిలో తెరవపోడం వల్ల కూడా కొంత సమస్య ఏర్పడింది. వివిధ కారణాలు చెప్పి యజమానులు నేటికీ వాటిని తెరలేదు. మిర్యాలగూడ ప్రాంతంలో సన్న రకాలు కొనుగోలు చేసే రైస్ మిల్లులు సుమారు 88 వరకూ ఉన్నాయి. అందులో ప్రస్తుతం 44 మాత్రమే నడుస్తున్నాయి. దీంతో ఉన్న మిల్లుల వద్ద రైతులు పడిగాపులు కాయాల్సి వస్తుంది.