Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్ప మీదనే మృతి
- వారం రోజులుగా కుప్పల వద్ద పడిగాపులు
నవతెలంగాణ-లింగంపేట్
నారు నాటింది మొదలు.. ప్రకృతి ప్రకోపాలు, చీడపీటల నుంచి పంటను కంటికి రెప్పలా కాపాడుకోవడం ఒకెత్తయితే.. చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు అంతకు మించి ప్రయాస పడాల్సిన దుస్థితి. ధాన్యం కొనుగోలు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన పాలకులు.. తూతూమంత్రంగా కేంద్రాలను ప్రారంభించి తూకం వేయకపోవడంతో రైతులు అక్కడే పడిగాపులు కాయాల్సి వస్తోంది. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పట్టింపులేనితనం వెరసి.. కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పల కాపలాకు వెళ్లి గుండె ఆగి రైతు మృతిచెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఐలాపూర్ గ్రామానికి చెందిన రైతు మామిడి చిన్న బీరయ్య (57)కు తనకున్న ఎకరం పొలంతో పాటు మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకొని వరిసాగు చేశాడు. ఇటీవల కోతలు పూర్తిచేసి ధాన్యాన్ని పది రోజుల కిందట లింగంపేట్ సొసైటీ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. వెంటనే తూకం వేయకపోవడంతో పది రోజులుగా కుప్పల వద్దే కాపలా ఉంటున్నాడు. ప్రస్తుతం చలితీవ్రత పెరిగినా.. బీరయ్య ప్రతిరోజు చలిలోనే వరి ధాన్యం కుప్ప వద్దనే కాపలాగా నిద్రపోయాడు. ఇటీవల వర్షం కురవడంతో ధాన్యం తడవడంతో ఆందోళనకు గురయ్యాడు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయ్యరేమోనని బెంగ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి కుప్ప వద్ద నిద్రపోయిన రైతు.. శుక్రవారం ఇంకా ఇంటికి వెళ్లలేడు. దాంతో కుటుంబీకులు వచ్చి చూడగా కుప్ప వద్దే రైతు విగతజీవిగా మారడంతో బోరుమన్నారు. ధాన్యం తూకం వేయడంలో అధికారులు, పాలకులు నిర్లక్ష్యం వహించడంతోనే రైతు మృతిచెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజులు కాంటాకు సెలవులతో పాటు వర్షాలు కురుస్తుండటంతో వడ్లు తడిసి పోతున్నాయనీ, దాంతో పెట్టుబడులు సైతం తిరిగి వస్తాయోరావోనని దిగులుపట్టుకున్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు కుటుంబాన్ని ఆదుకొని, మరిన్ని రైతుల ప్రాణాలు పోకముందే సకాలంలో తూకం వేయాలని రైతులు కోరుతున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.