Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్లాల్లో ధాన్యపు రాసులు...
- ఐకేపీ కేంద్రాలు ప్రారంభించని సర్కార్
- కోతలు అపాలంటూ అధికారుల ఒత్తిడి
- వర్షాలకు నష్టపోతున్న అన్నదాతలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రస్తుత వానాకాలం సీజన్లో వరి కోతలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల ధాన్యం కల్లాలకు చేరింది. రోడ్ల వెంబడి, కల్లాల్లోనూ ధాన్యపు రాసులు సందర్శనమిస్తున్నాయి. టార్ఫాలిన్ కవర్లు కప్పి ధాన్యానికి రైతులు కాపల కాస్తున్నారు. ఆర్నెల్లు కష్టపడి పండించిన పంట అమ్ముకునేందుకు వారు నానా అవస్థలు పడాల్సి వస్తున్నది. రాసులు పెరుగుతున్నాయి, తప్ప కొనేవారే కరువయ్యారు. ధాన్యం పోటెత్తుతుండటంతో దాన్ని ఆపేందుకు అక్కడక్కడ అధికారులు హద్దు మీరుతున్నారు. నల్లగొండ జిల్లా వేములపల్లిలో అనుమతి ఉంటేనే వరికోతలు కోయాలంటూ అధికారులు హర్వెస్టర్ల యాజమానులను బెదిరిస్తున్నారు. ప్రభుత్వం కొంటుందనే ఆశతో రైతులు ధాన్యాన్ని మార్కెట్లకు తీసుకొస్తున్నారు. కానీ అకాల వర్షాలు, ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో కల్లాలోకి, మార్కెట్లలో రాసులు పోసిన ధాన్యం కొట్టు కుపోతున్నది. వడ్లు తడుస్తున్నాయి. వీటి ఫలితంగా రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొంటుందా? కొనదా? అనే సందేహాం రైతులను వెంటాడుతూనే ఉన్నది. వానాకాలం వడ్లు కొంటామంటూ ముఖ్యమంత్రి రైతులకు భరోసా ఇచ్చారు. అయినా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కొనకపోతే...భారీ నష్టం
రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనకపోతే రైతులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, మెదక్ జిల్లాలో అత్యధికంగా వరి పండుతున్నది. మిగతా జిల్లాల్లో తక్కువగా వస్తున్నది. సాగు పెట్టుబడి కోసం అప్పులు చేసి మరీ వరి పండించారు. కానీ మార్కెట్లలోకి పొటెత్తున్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనడం లేదు. కొనుగోలు ఆలస్యం కావడటంతో ఆరబెట్టడానికి హమాలీ ఖర్చులు, రవాణా వ్యయం, వానలు పడితే ధాన్యం తడిసిపోవడం, టార్ఫాÛలిన్ కవర్ల ఖర్చు తడిసి మోపడవుతున్నది.మరోవైపు రాసుల కాపల ఉన్న రైతు మరో పని చేసుకోలేక పడిగాపులు కాయాల్సి వస్తున్నది. ఈ క్రమంలో పది రకాలుగా రైతులు నష్టపోతారని రైతు సంఘాలు అంటున్నాయి. పండిన పంటను ప్రభుత్వం వెనువెంటనే కొనకపోవడంతో దళారుల హవా పెరుగుతున్నదని చెబుతున్నారు. ఏ గ్రేడ్ వడ్లు క్వింటాల్కు రూ 1888, కామన్ వెరైటీకి రూ 1868 మద్దతు ధర ఉన్నది. దీని ప్రకారమే ప్రభుత్వం కొనాల్సి వుంటుంది. కొనడం ఆలస్యం కావడంతో పొల్లాల్లోనే రైతుతో మధ్యదళారులు బేేేరసారాలు చేస్తున్నారు. ప్రభుత్వం కొంటే ఎప్పటికోగానీ బ్యాంకుల్లో డబ్బులు పడవు. ఇప్పటికిప్పుడే నగదు ఇస్తామంటూ దళారులు ప్రలోభపెట్టి, అగ్గువకు కొనుగోలు చేస్తున్నారు. క్వింటాల్కు రూ 1300, రూ 1400, రూ 1500 వరకు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో రైతులు క్వింటాల్కు నాలుగైదు వందలు నష్టపోవాల్సిన దుస్థితి నెలకొంది. అప్పులోళ్లు సైతం తమకే వడ్లు అమ్మేలా ముందుగానే ఒప్పందాలు చేసుకుంటారు. దీని ప్రకారం మద్దతు ధరతో సంబంధం లేకుండా ఎంత చెప్పితే అంతకే అమ్మాల్సి వస్తున్నదని రైతులు చెబుతున్నారు.
లక్ష్యం బారెడు....కొనుగోలు మూరెడు
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో భారీ లక్ష్యం పెట్టుకుంది. ఇప్పటివరకు కొన్నది మాత్రం మూరెడుగానే మిగిలిపోయింది. కోటి రెండు లక్షల టన్నుల ధాన్యాన్ని కొనాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ లక్ష్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమాడదూరంలో ఉన్నది. ఇప్పటివరకు 60వేల టన్నుల కూడా కొనుగోలు చేయలేదు. అక్టోబర్ 25లోపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సిఉంది. ఇందుకోసం రాష్ట్రంలో 6,700 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నది. అందులో ఇప్పటి వరకు 800 కూడా ప్రారంభించలేదని రైతు సంఘాలు చెబుతున్నాయి. ఇంకా 20 జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వం అప్రమత్తం కావాలి
- వర్ణ వెంకటరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు, తెలంగాణ రైతుసంఘం
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించకపోవడంతో రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతున్నది.కోతలకు ముందుగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండేది. ఇందుకోసం ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ముందుగా కోతలు కోసిన రైతులు తమ పంటను కల్లాల్లో పోశారు. వాటిని వెంటనే కొనాలి. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనాలి. లేకపోతే అకాల వర్షాలతో పంటనష్టానికి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి.