Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీజీపీకి ఈటల రాజేందర్ సవాల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'పక్షపాతం వహించకుండా అన్ని రాజకీయ పార్టీలనూ సమానంగా చూస్తామంటున్న డీజీపీగారూ.. సీడీలు పంపుతా..చర్యలు తీసుకుంటావా?' అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. టీఆర్ఎస్ కండువాలు కప్పుకోవాలంటూ సీఐలు, ఎస్ఐలు హుజురాబాద్ ప్రజలను బెదరించిన సీడీలు తమ దగ్గర ఉన్నాయనీ, వాటిని ఈసీకి అందజేసే పనిలో ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం బదులు కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతున్నదని విమర్శించారు. శనివారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఈటల రాజేందర్ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల చైతన్యాన్ని మరిచి ఉప ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బులను వినియోగించి భంగపడ్డ మొదటి సీఎం కేసీఆర్నేనన్నారు. హుజూరాబాద్ ప్రజలకు గెలుపును అకింతమిస్తున్నామని చెప్పారు. మీడియా గొంతునొక్కాలని కేసీఆర్ చూస్తే ఆయన దృష్టపాలనను సోషల్మీడియా ఎత్తిచూపిందని ప్రశంసించారు. ఆరునెలలుగా హుజూరాబాద్ ప్రజల గొంతులను అధికార పార్టీ నొక్కేసిందన్నారు. ఆయా శాఖల అధికారులు, పోలీసులు అడుగడుగునా భయభ్రాంతులకు గురిచేశారనీ, వారి కనుసన్నల్లోనే ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బులు పంచారని ఆరోపించారు. ప్రజలు కట్టే పన్నుల ద్వారా తమకు జీతాలు వస్తున్నాయనే సోయిని ఉద్యోగులు మరవొద్దని చురకలంటించారు. ఒక ఎన్నికకు రూ.500 కోట్ల ఖర్చా? ఎక్కడ నుంచి వచ్చాయి? అని ప్రశ్నించారు. ఆట మొదలైందనీ, ప్లేస్ ఏదయినా టీఆర్ఎస్ సర్కారును కూల్చడమే ధ్యేయంగా పనిచేస్తానని ప్రకటించారు.
దళిత బంధు గురించి ఏనాడైనా అసెంబ్లీలో చర్చించారా? అని ప్రశ్నించారు. దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలంటూ పోరాడుతామని ప్రకటించారు. తానూ ఆర్థిక మంత్రిగా పనిచేశాననీ, రాష్ట్రంలో అన్నీ పోనూ ఏటా రూ.5 వేల నుంచి రూ.10వేల కోట్లకు మించి మిగులు ఉండదని చెప్పారు. రూ.2 లక్షల కోట్లు ఎక్కడ నుంచి తెస్తారో సీఎం కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. సీఎంఓలో దళితులు, గిరిజనులు, మైనార్జీ అధికారులు ఉన్నారా? అని నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎట్లాగూ ఇవ్వలేకపోయావు..ఐటీ హబ్గా చెబుతున్న హైదరాబాద్లోగానీ, పరిశ్రమల్లోగానీ తెలంగాణ బిడ్డలకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావో చెప్పాలన్నారు. ప్రజలకు, ఉద్యోగులకు అండగా ఉంటూ కేసీఆర్ అహంకారాన్ని ఎండగతానన్నారు. హుజూరాబాద్ ప్రజలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనిదన్నారు.
కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి మాట్లాడుతూ..నిజాయితీగల ఈటల రాజేందర్ను దోషిగా నిలబెట్టాలని చూస్తే కేసీఆర్ను ప్రజలు నమ్మలేదన్నారు. తెలంగాణ చరిత్రలో హుజురాబాద్ ఎన్నిక కీలక మలుపుగా మారబోతున్నదన్నారు. కేసీఆర్ కుటుంబపాలన పోవాలనే భావన ఉద్యోగులు, మేధావులు, యువతలో బలంగా ఉందన్నారు. వరంగల్లో టీఆర్ఎస్ పార్టీ విజయగర్జన సభను కల్వకుంట్ల గర్జనగా మార్చుకోవాలని సూచించారు. కేసీఆర్ ఒక్కడి వల్ల తెలంగాణ రాలేదనీ, యావత్ తెలంగాణ ప్రజానీకం పోరాటం, రాజకీయ పార్టీల ఐక్యత వల్ల వచ్చిందని చెప్పారు. తెలంగాణను వ్యతిరేకించినవాళ్లు, కేసీఆర్ను తిట్టిపోసినవాళ్లంతా ఆయన ప్రభుత్వంలో కీలకపదవుల్లో ఉన్నారన్నారు. హుజూరాబాద్ ఎన్నికల స్ఫూర్తిని ప్రతి గ్రామానికీ తీసుకెళ్తామన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరు మాట్లాడుతూ..హుజూరాబాద్లో ఈటల గనుక ఓడిపోతే డబ్బుల మూటలతో ఎన్నికల్లో గెలవొచ్చనే మెసేజ్ వెళ్లేదనీ, రాజకీయాలను ప్రజలు ఈసడించుకునేవారని అన్నారు. ఈటల మంచితనం ముందు కేసీఆర్ డబ్బులు పనిచేయలేదని చెప్పారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై టీఆర్ఎస్ నేతలు అబద్ధప్రచారాలకు పూనుకున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు పథకం అమలు కోసం ఈ నెల 9న హైదరాబాద్లో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డప్పుల మోత కార్యక్రమాన్నీ, 16న నిరుద్యోగ మిలియన్ మార్చ్ను నిర్వహిస్తామని ప్రకటించారు. వరివేస్తే ఉరే అంటే రైతాంగమంతా ఒక్కటే కేసీఆర్ రాజకీయ జీవితానికి చరమగీతం పాడుతారని హెచ్చరించారు. 2023 ఎన్నికల్లో గెలుపు తమదేనన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్రావు, మాజీ ఎంపీలు విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, జితేందర్రెడ్డి, గరికపాటి మోహన్రావు, రవీంద్రనాయక్, మాజీ మంత్రులు బాబూమోహన్, చంద్రశేఖర్, విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యేలు ఇంద్రసేనారెడ్డి, ఏనుగురవీంద్రెడ్డి, లక్ష్మినారాయణ, ధర్మారావు, కూనశ్రీశైలంగౌడ్, ఎవ్వీఎస్ఎస్ ప్రభాకర్, నందీశ్వర్గౌడ్, బీజేపీ రాష్ట్ర నేతలు గొంగిడి మనోహర్రెడ్డి, ప్రేమేందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.