Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఐటీ నీట్ ఫలితాల్లో ర్యాంకులు సాధించాలి
- మంత్రి కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మైనార్టీ విద్యార్థులను అత్యుత్తములుగా తీర్చిదిద్దాలనీ, ఐఐటీ, నీట్ ఫలితాల్లో వారు మరిన్ని ర్యాంకులు సాధించాలని ఆ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మైనార్టీ గురుకులాల నిర్వాహణ పనితీరుపై శనివారం హైదరాబాద్లోని బంజారాహిల్స్ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, ప్రభుత్వ కార్యదర్శి అహ్మద్ నదీమ్, విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి షఫీవుల్లాతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. గురుకులాల నిర్వహణ, పనితీరు, ఫలితాలు, ఉన్నతి గురించి అధికారులను మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది 124 పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేసినట్టు, వీటి కోసం 48 భవనాలను అద్దెకు తీసుకున్నట్టు షఫీవుల్లా మంత్రికి వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 204 పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. వీటిలో ఇంగ్లీష్ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు పోషక విలువలతో ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. వీటికి అదనపు నిధుల మంజూరు, బకాయి పడిన కిరాయిల గురించి ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకోవాల్సిిందిగా వారికి సూచించారు. ఆహార పదార్థాల నిల్వలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలనీ, నాణ్యతా, పోషకాల విషయంలో ప్రమాణాలు తప్పక పాటించాలనీ, విద్యార్థులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రతి శనివారం రెండు గంటలు ''పాఠశాల ప్రగతి'' పేరిట పరిసరాల పరిశుభ్రత, మొక్కల్ని నాటడం,వాటికి నీళ్లు పోయడం వంటి పనులు చేపట్టాలని సూచించారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో మన విద్యార్థులు మరిన్ని అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు.