Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి కల్పన పెద్ద సవాల్
- ఉన్నత విద్యామండలి చైర్మెన్ లింబాద్రి
- పలువురు వీసీలకు ఎగ్జిబిషన్ సొసైటీ సన్మానం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి అన్నారు. విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వీసీల సన్మాన కార్యక్రమం ఎగ్జిబిషన్ సొసైటీ, ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్, ఎకనామిక్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లోని నాంపల్లిలో జరిగింది. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ పేదలు, మహిళలకు విద్య అందించడం కోసం ఎగ్జిబిషన్ సొసైటీ కృషి చేస్తున్నదని చెప్పారు. కమలా నెహ్రూ మహిళా పాలిటెక్నిక్ కాలేజీని ప్రారంభించడం వల్ల ఎంతో అమ్మాయిలు ఉన్నతస్థాయికి ఎదిగారని వివరించారు. కోవిడ్-19 వల్ల ప్రత్యక్ష తరగతుల నుంచి ఆన్లైన్ బోధనకు మారిందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. అయితే ఉపాధి అవకాశాలు కల్పించడం పెద్ద సవాల్ అని అన్నారు. ఈ అవకాశాలను పెంపొందించేందుకు ఇంజినీరింగ్, డిగ్రీలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టామని వివరించారు. విద్యార్థులకు నైపుణ్యాన్ని అందించి ఉద్యోగాలు పొందేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్రంలో తొమ్మిది డిగ్రీ కాలేజీల్లో క్లస్టర్ విధానం అమల్లోకి తెచ్చామన్నారు. ఉన్నత విద్యలో నాణ్యమైన విద్య అందించేందుకు యూకేలోని విశ్వవిద్యాలయంతో ఓయూ, కేయూ సిలబస్ అభివృద్ధి కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయని వివరించారు.
లింబాద్రితోపాటు డి రవీందర్ (ఓయూ), టి రమేష్ (కేయూ), కట్టా నర్సింహ్మారెడ్డి (జేఎన్టీయూహెచ్), ఎస్ మల్లేషం (ఎస్యూ), డి రవీందర్గుప్తా (టీయూ), ఎల్వి లక్ష్మికాంత్ రాథోడ్ (పీయూ), సిహెచ్ గోపాల్రెడ్డి (ఎంజీయూ), కె సీతారామారావు (బీఆర్ఏఓయూ), నీరజా ప్రభాకర్ (కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ వర్సిటీ) వీసీలను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ గౌరవ కార్యదర్శి బి ప్రభా శంకర్, ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి జిఆర్ అశోక్, ఎకనామిక్ కమిటీ గౌరవ కార్యదర్శి ఎన్ సురేందర్, ఓయూ సైన్స్ ఫ్యాకల్టీ డీన్ ఎ బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.