Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్బులు వసూలు చేస్తున్న ముఠా అరెస్ట్
నవతెలంగాణ-సిటీబ్యూరో/నేరేడ్మెట్
మావోయిస్టుల పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న మాజీ మావోయిస్టుల ముఠాను యాదాద్రి ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మూడు తుపాకులు, నాటు తుపాకీ, 6 డిటోనేటర్లు, 15గ్యాస్ సిలిండర్లు, బుల్లెట్లలో వాడే పౌడర్ 40 గ్రాములు, మావోయిస్టు లెటర్ హెడ్స్, డ్రిల్లింగ్ మెషిన్, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. శనివారం అదనపు సీపీ జి.సుధీర్బాబు, అదనపు డీసీపీ జే.సురేందర్రెడ్డితో కలిసి రాచకొండ సీపీ మహేష్భగవత్ మీడియాకు వివరాలు వెల్లడించారు. జనగాం జిల్లాకు చెందిన పిట్టల శ్రీనివాస్, భువనగిరి జిల్లాకు చెందిన వి.నాగమల్లయ్య, సూర్యాపేటకు చెందిన ఎడవెళ్లి శ్రీనివాస్రెడ్డి, చిట్యాలకు చెందిన జి.స్వామితోపాటు మరికొంత మంది ఒక ముఠాగా ఏర్పడ్డారు. నలుగురు నిందితులు గతంలో జనశక్తి పార్టీలో పనిచేశారు. సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ప్రధాన నిందితుడు పిట్టల శ్రీనివాస్కు తుపాకీ తయారు చేయడం తెలియడంతో పిస్తోళ్లు, తపంచా తయారు చేశాడు. యాదాద్రి శివారు ప్రాంతాల్లో దారి దోపిడీలు, షాపుల్లో బెదిరింపులకు పాల్పడుతూ డబ్బు వసూలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు ప్రత్యేక నిఘా వేసి నిందితులను అరెస్టు చేశారు. నాగమల్లయ్య గతంలో ఓ హత్యకేసులో నిందితుడిగా ఉన్నాడు. పరారీలో వున్న అశోక్తోపాటు పలువురికోసం గాలిస్తున్నామని సీపీ తెలిపారు.