Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 రోజుల్లోగా వివరణివ్వాలంటూ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తమకు ప్రమోషన్లు కల్పించాలంటూ ధర్నా చేసిన సాగునీటి పారుదల, ఆయకట్టు శాఖలోని పలువురు ఇంజినీర్లకు ఆ శాఖా ఉన్నతాధికారులు నోటీసులు జారీచేశారు. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈమేరకు సాగునీటి పారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ జి. అనిల్కుమార్ పేర ఉత్తర్వ్యులు వెలువడ్డాయి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న తమకు ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దాదాపు పదుల సంఖ్యలో ఆయా క్యాడర్లకు చెందిన ఇంజినీర్లు శుక్రవారం సాయంత్రం సాగునీటి శాఖ ప్రధాన కార్యాలయంలోని పరిపాలనా విభాగం ఇంజినీర్ ఇన్ చీఫ్ జి.అనిల్కుమార్ ఛాంబర్ ముందు భైటాయించి నిరసన తెలిపారు. ఇందులో కె.చక్రధర్, టివి ప్రసాద్, ఆర్.ప్రసాద్, పి.పిచ్చయ్య, కె.బుచ్చయ్య, ఎన్.శేషగిరి, కె. బ్రహ్మచారి తదితర ఇంజినీర్లు సైతం పాల్గొన్నారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు ఇచ్చారు. ఇది సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో జరిగింది. దీనిపై సంబంధిత ఇంజినీర్లకు ప్రభుత్వ ఉద్యోగుల క్రమశిక్షణా నిబంధనలను ఉటంకిస్తూ నోటీసులు జారీచేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు ముందస్తు సమాచారం లేదా అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ప్రదర్శనలు, ఆందోళనలు చేయరాదంటూ నిబంధనలు ఉన్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు.