Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సబ్జెక్టు నిపుణులు, సీఈ, ఏఈలుగా జూనియర్లకు అవకాశం : టిగ్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణగౌడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియట్ విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనంలో సీనియర్లకు కాకుండా జూనియర్లకు సబ్జెక్టు నిపుణులు, సీఈ, ఏఈలుగా విధులు కేటాయించడం సరైంది కాదని తెలంగాణ ఇంటర్ ప్రభుత్వ లెక్చరర్ల సంఘం (టిగ్లా) ప్రధాన కార్యదర్శి మాచర్ల రామకృష్ణగౌడ్ తెలిపారు. ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం నుంచి ఇంటర్ మూల్యాంకనం ప్రారంభమైందనీ, క్యాంపు నిర్వహణకు అతి ముఖ్యమైన అపాయింటెడ్, నాన్ అపాయింటెడ్ లిస్ట్లు క్యాంపులకు పంపలేదని వివరించారు. ఏటా ఇంటర్ బోర్డు అధికారులు ఇదేవిధంగా సీనియర్లను అవమానించేలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల నిర్వహణలో, మూల్యాంకనంలోనూ ప్రభుత్వ కాలేజీల అధ్యాపకులే విధుల్లో నిమగమయ్యారని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులు నష్టపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.