Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాసంఘాల నిర్ణయం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖ్కింపూర్ ఘటనలో మరణించిన రైతుల అస్థికలను కృష్ణా, గోదావరి నదుల్లో కలుపుతామని ప్రజాసంఘాల నాయకులు వెల్లడించారు. ఖమ్మం మీదుగా గోదావరిలో కలపడానికి, మరొకటి మిర్యాలగూడ జిల్లా మీదుగా కష్ణా నదిలలో కలపడానికి రెండు జాతాలను నడపాలని నిర్ణయించినట్టు తెలిపారు. శనివారం హైదరాబాద్లోని రైతు సంఘం రాష్ట్ర కార్యాలయానికి అస్థికలు చేరుకున్నాయి. వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి వెంకట్ వాటిని ప్రజాసంఘాల నాయకులకు అందజేశారు. ఇందులో ఏఐకెేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహ్మారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం సాయిబాబు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి ప్రసాద్, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శిలు జె.వెంకటేష్, పాలడుగు భాస్కర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొప్పని పద్మ, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్లు ఉన్నారు.అనంతరం బి. వెంకట్, సాయిబాబు, సాగర్ మాట్లాడుతూ లఖ్కింపూర్ కేరీ రైతు అమర వీరుల అస్థికలను దేశవ్యాప్తంగా ఉన్న పవిత్రమైన నదుల్లో కలపాలని కిసాన్ సంయుక్త మోర్చా (కేఎస్ఎం)నిర్ణయించిందన్నారు. అందులో భాగంగా మన రాష్ట్రంలో ఉన్న గోదావరి, కష్ణా నదులలో కలిపి రైతు అమర వీరుల పోరాట స్ఫూర్తిని రైతాంగంలో నింపుతామని చెప్పారు. సాగు చట్టాలను రద్దు చేయాలంటూ గత 11 నెలలుగా రైతులు పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. చలి, వడగాల్పులు, కుంభవృష్టిని సైతం లెక్క చేయకుండా ఉద్యమం కొనసాగిస్తున్నారని వివరించారు. రైతాంగ ఉద్యమంలో ఇప్పటికే 600 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. రైతుల ఉద్యమ ఫలితంగానే వివిధ రాష్ట్రాల్లో బీజేపీపై వ్యతిరేకత పెరిగిందన్నారు.ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలొచ్చాయని తెలిపారు. అమర వీరుల అస్థికలను దేశవ్యాప్తంగా నదుల్లో కలపడాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.