Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూములివ్వబోమంటున్న రైతులు
- హద్దులు పోతే వివాదాలే.. అంటున్న రైతులు
- టీఆర్ఎస్ ఎమ్మెల్యే, అనుచరుల దౌర్జన్యం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
టీఆర్ఎస్ 20 ఏండ్ల 'విజయగర్జన' సభ స్థల సేకరణ వివాదాస్పదంగా మారింది. వారం రోజులుగా మంత్రులు, ఎమ్మెల్యే, వారి అనుచరగణం రైతులను భయబ్రాంతులకు గురిచేస్తూ వారి భూములను బలవంతంగా చదునుచేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో రైతులు అడ్డుకొని తమ భూములు ఇవ్వమంటూ తెగేసి చెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హన్మకొండ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం హసన్పర్తి మండలం దేవన్నపేట టోల్ప్లాజా సమీపంలో 'విజయగర్జన' సభ ప్రతిపాదిత స్థలం వద్దకు శనివారం ఉదయం ధర్మసాగర్ సొసైటీ చైర్మెన్ గుండ్రెడ్డి రాజేశ్వర్రెడ్డి, 65వ డివిజన్ కార్పొరేటర్ భర్త, మాజీ కార్పొరేటర్ రాజునాయక్ చేరుకున్నారు. మంత్రి, ఎమ్మెల్యేలు కూడా వస్తున్నట్టు తెలుసుకున్న పరిసర ప్రాంతాల రైతులు, ప్రజలు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాజేశ్వర్రెడ్డి, రాజునాయక్తో రైతులు, మహిళలు వాగ్వాదానికి దిగారు. వరి కోత దశలో ఉందనీ, ఈ దశలో మా భూములను చదును చేస్తే పంట నష్టపోతామనీ, అంతేకాకుండా పంట భూములను చదును చేస్తే వాటికి మళ్లీ హద్దులు పెట్టుకోవడం కష్టమై వివాదాలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు రైతులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్థానిక నాయకులు రాజునాయక్తోపాటు టీఆర్ఎస్ అధ్యక్షులు, ఇతర నేతలు స్థానికంగా ఉండి అత్యంత రహస్యంగా రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించడం గమనార్హం.
టీఆర్ఎస్ 'విజయగర్జన' సభ కోసం వరంగల్కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నగరం చుట్టూ పలు ప్రాంతాలను పరిశీలించి, చివరకు వర్ధన్నపేట నియోజకవర్గం హసన్పర్తి మండలం దేవన్నపేట పరిసర ప్రాంతాల్లో హైవే బైపాస్ రోడ్డు సమీపంలోని స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ ప్రాంతంలో 300-350 ఎకరాలు అవసరమని భావించారు. ఇందులో సుమారు 80-100ఎకరాల్లో వరి, పత్తి పంటలున్నాయి. మిగతా భూమిలో రియల్ ఎస్టేట్ వెంచర్లున్నాయి. వెంచర్ల యాజమాన్యాలు చాలా వరకు ప్లాట్లను అమ్మేశారు. ఇప్పుడు సభ కోసం ఆ భూములను చదును చేస్తే మళ్లీ హద్దులను గుర్తించడం అసాధ్యమని ప్లాట్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సభ కోసం టీఆర్ఎస్ నేతలు ఇంత పెద్ద మొత్తంలో భూమిని చదును చేస్తే భూముల వివాదాలు పుట్టుకొచ్చి కొత్త సమస్యలు తలెత్తుతాయని అటు ప్లాట్ల యాజమానులు, ఇటు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారంతా మూకుమ్మడిగా భూములు ఇవ్వబోమని స్పష్టం చేస్తున్నప్పటికీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు బలవంతం చేయడం సరికాదని వారు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
మా ఓట్లతో గెలిచి మాపైనే దౌర్జన్యమా..?
మా ఓట్లతో గెలిచి.. పోలీసోళ్లు, రౌడీలను తీసుకొచ్చి మాపై దౌర్జన్యం చేస్తారా.. అంటూ దేవన్నపేట గ్రామస్తులు టీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూముల వ్యాపారం చేసుకునేటోళ్లు రాజకీయాలకు వచ్చి మమ్మల్ని ఇబ్బందులు పెడుతుండ్రని రైతులు వాపోయారు. మా మీద దాడులు చేస్తే మేమూరుకోం.. మేమూ కర్రలు పడతం.. ఏపాటి వస్తరో రాండ్రి.. అంటూ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేం కష్టపడి సంపాదించుకున్న భూములను కూడా మీరు అమ్ముకుంటరా.. అంటూ ప్రశ్నిస్తున్నారు.
ప్లాట్లు, పొలాలకు మళ్లీ హద్దులు గుర్తిస్తాం : మాజీ కార్పొరేటర్ రాజూనాయక్
సభ కోసం భూమిని చదును చేసే ముందే 'కుడా' అధికారులతో లే అవుట్ మ్యాప్ను సిద్ధం చేస్తున్నాం. హద్దుల సమస్యలు తలెత్తకుండా ప్లానింగ్ చేశాం. పంటలకు నష్టం జరిగితే నష్టపరిహారం ఇవ్వడానికి ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారు. సభ ఇక్కడ జరగడం వల్ల నలు దిశలా రోడ్లు వేయడంతో అభివృద్ధి జరుగుతుంది. ఎవరికీ నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.