Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
- బాధిత కుటుంబానికి రూ. 5 వేలు అందజేత
నవతెలంగాణ-కందుకూర్
అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ. 10లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం అన్నోజిగూడ గ్రామానికి చెందిన రైతు నీలం రాములు మూడు రోజుల కిందట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆయన శనివారం అన్నోజిగూడ గ్రామానికి వెళ్లి రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని పరామర్శించి, రూ. 5 వేలు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ధరణి పని చేయక ఎంతో మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఫార్మాసిటీలో తనకు ఉన్న భూమిని ప్రభుత్వ భూమిగా రెవెన్యూ అధికారులు ప్రకటించి, పరిహారం ఇవ్వకుండా, ఇతర భూమికి ధరణిలో పేరు నమోదు కాక, పెళ్లీడుకొచ్చిన కూతురు వివాహం చేసి, అప్పుల్లో కూరకుపోయాడని వాపోయాడు. ఆర్థిక ఇబ్బందులు భరించలేక రైతు ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా అనేకం జరుగుతున్నా.. ప్రభుత్వం మాత్రం ఇటువంటి ఘటనలను పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధరణి వైబ్సైట్ను పరిశీలించి రైతులకు మేలు జరిగేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగల్ల భాస్కర్, జిల్లా కోర్ కమిటీ సభ్యులు పి.యాదయ్య, మధుసూదన్ రెడ్డి, కందుకూరు మండల కార్యదర్శి ఆర్.చందు, మహేశ్వరం మండల కార్యదర్శి అల్వాల రవికుమార్, అన్నోజిగూడ కార్యదర్శి మధు పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఢిల్లీ యాదయ్యకు తమ్మినేని ఎర్ర కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.