Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వం డీజిల్పై వ్యాట్ తగ్గించాలి: తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ధాన్యం కొనుగోళ్ల పేరుతో పౌరసరఫరాలు, రెవెన్యూ, పోలీస్, రవాణాశాఖల అధికారులు బలవంతంగా లారీలను గుంజుకుంటున్నారని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మంచిరెడ్డి రాజేందర్రెడ్డి, ఎస్కే చాంద్పాషా ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం లోడ్ చేసి, మార్కెట్ యార్డుల వద్ద వారం, పదిరోజులు పడిగాపులు కాయిస్తున్నారనీ, దీనివల్ల డ్రైవర్లు, క్లీనర్లు నానా అవస్థలు పడుతున్నారని చెప్పారు. 2019-20 నాటి రేట్లనే లారీలకు చెల్లిస్తున్నారనీ, ఇప్పుడు పెరిగిన డీజిల్ ధరల్ని ఇవ్వట్లేదన్నారు. దీనివల్ల తాము ఎదురు పెట్టుబడి పెట్టి, రోజుల తరబడి ఎదురు చూస్తూ, నష్టాలపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారంనాడిక్కడి ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రప్రభుత్వం డీజిల్పై రూ.10 తగ్గించిందనీ, రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు. చాలా రాష్ట్రాలు ఇప్పటికే రూ. 10 నుంచి రూ.12 వరకు తగ్గించాయనీ, ఆదే రీతిలో రాష్ట్రం కూడా పదిరోజుల్లో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లారీలు స్వాధీనం చేసుకోవడం, డీజిల్పై వ్యాట్ తగ్గించడంతో పాటు లారీ యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లపై ఉద్దేశ్యపూర్వకంగా కేసులు పెట్టడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పదిరోజుల్లో పై అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుంటే ఎక్కడి లారీలను అక్కడే రోడ్లపై నిలిపివేసి, సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. లారీ యజమానుల సమస్యలపై ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇచ్చామనీ, వారెవరూ స్పందించట్లేదన్నారు. తామే చేసే సమ్మెకు ఆ అధికారులే బాధ్యత వహించాలని స్పష్టంచేశారు. తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎండీసీ) ద్వారా నిర్వహిస్తున్న ఇసుక క్వారీల్లో ఓవర్లోడ్ ఉండే, లారీని నింపిన ఆ సంస్థ ఉద్యోగులు, అధికారులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
తైబజార్ రద్దు అయినా, ఇప్పటికీ దౌర్జన్యంగా వసూళ్లు చేస్తున్నారనీ, ముఖ్య నగరాల్లో తమకు పార్కింగ్ స్థలాలు కేటాయించాలనీ, ఈ-చలానాలు బంద్ చేయాలని కోరారు. డ్రైవర్లు, క్లీనర్లకు శిక్షణ నిమిత్తం డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటు చేయాలనీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కౌంటర్ సిగేచర్ పర్మిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వ అధికారుల అలసత్వం వల్ల తాము నష్టపోవాల్సి వస్తుందని వివరించారు. కౌంటర్ సిగేచర్ పర్మిట్తో సంవత్సరానికి రూ.5వేలు కడితే సరిపోతుందనీ, కానీ ఇప్పుడు ట్రిప్పుకు రూ.1,700 చెల్లించాల్సి వస్తున్నదని తెలిపారు. డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని కోరారు. ఇవే అంశాలపై గతంలో రెండుసార్లు సమ్మె చేశామనీ, అప్పట్లో సమస్యలు పరిష్కరిస్తామని మంత్రులు రాతపూర్వకంగా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. వారు రాసిచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదనీ, మంత్రులు రాసిచ్చిన పేపర్లకే విలువ లేకుంటే ఎలాగని ప్రశ్నించారు. రాష్ట్రంలో 1.77 లక్షల లారీలు ఉన్నాయనీ, వాటివల్ల ప్రభుత్వానికి దాదాపు రూ.100 కోట్ల వరకు పన్నులు చెల్తిస్తున్నామని గుర్తుచేశారు. పలు ప్రభుత్వ శాఖల అధికారులు రోడ్లపై బలవంతంగా లారీలను ఆపి, డబ్బులు ఇవ్వకుండా, సొంత పనులకు వినియోగించుకుంటున్నారనీ, ప్రశ్నిస్తే కేసులు పెట్టి, చలానాలు రాస్తున్నారని చెప్పారు. తక్షణం ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్ష, సంయుక్త కార్యదర్శులు రామినేని శ్రీనివాసరావు, కొయ్యడ సుధాకర్గౌడ్ తదితరులు మాట్లాడారు.