Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడిగిన వారందరికీ అటవీ భూమిస్తే అడవులు మిగలవ్..: మంత్రి కేటీఆర్
నవతెలంగాణ - సిరిసిల్ల
పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారానికి పటిష్ట చర్యలు చేపడతామని ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. శనివారం సిరిసిల్ల కలెక్టరేట్లో పోడు భూముల సమస్య పరిష్కారం, అడవుల పునరుజ్జీవనం తదితర అంశాలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో ప్రాధమిక అంచనా ప్రకారం 96వేల 394ఎకరాల అటవీ ప్రాంతం 20 శాతం మేర ఉన్నదన్నారు. సుమారు 8వేల ఎకరాల్లో గిరిజన, ఇతరులు పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి చెందుతున్నట్టు తెలిపారు. పేదవారికి న్యాయం చేస్తూ, అడవినీ, పుడమినీ కాపాడుకోవడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. సమస్యను నివృత్తి చేసే క్రమంలో అర్జీదారులు అబద్దాలు తెలిపినా, పైరవీలకు పాల్పడ్డట్టు తెలిసినా జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. అడిగిన వారందరికీ అటవీ భూములిచ్చుకుంటబోతే.. రాబోయే తరాలకు అడవి మిగలదన్నారు. 33శాతం అటవీ ప్రాంతంతో వాతావరణ సమతుల్యత ఉంటుందని, పార్టీలకతీతంగా అన్ని పక్షాల సమ్మతితో పారదర్శకంగా ముందుకు వెళ్లాలన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఆర్వోఎఫ్ ఆర్ చట్టం తెచ్చి గిరిజనులకు హక్కులు కల్పించిందని, గిరిజనేతరుల విషయంలో కేంద్ర చట్టం అడ్డంకిగా ఉందని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి అఖిలపక్షంతో కలిసి కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పోడు సమస్యలు ఉన్న 67 గ్రామాల్లో సదస్సుల నిర్వహణ అనంతరం సేకరించిన డేటాతో తిరిగి అఖిలపక్ష సమావేశం నిర్వహించి పారదర్శకంగా చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. పేదవారికి జీవనోపాధి, భవిష్యత్తు తరాలకు అడవి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలన్నారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు మాట్లాడుతూ.. జిల్లాలో ఇంకా 10శాతం అటవీ సంపద పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ.. గ్రామసభల ద్వారా గిరిజన, గిరిజనేతరుల అర్జీలు స్వీకరిస్తామన్నారు. గ్రామస్థాయిలో సర్పంచ్ అధ్యక్షతన, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఏ, అటవీ బీట్ అధికారి, మండల సర్వేయర్లతో కూడిన బృందం సోమవారం నుంచి అర్జీలు ఏ ఫారంలో, ఎలా సమర్పించాలి అనే విషయంలో అర్జీదారులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఎనిమిది మండలాల పరిధిలోని 67గ్రామాల్లో అటవీ హక్కు కమిటీలు ఏర్పాటు చేసి, ప్రతి అర్జీనీ పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. తమ పరిధిలో ఇప్పటి వరకు అటవీ భూముల్లో ఉన్న అర్హులైన వారికి హక్కులు కల్పించిన పిమ్మట.. ఇకపై ఎలాంటి అన్యాక్రాంతం, ఆక్రమణలు జరగనివ్వబోమని సమావేశంలో ప్రతిజ్ఞ చేశారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ ఎన్.అరుణ, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్, జిల్లా అటవీ అధికారిణి బాలామణి, జెడ్పీ సీఈవో గౌతం రెడ్డి, డీపీఓ రవీందర్, కొండూరు రవీందర్ రావు పాల్గొన్నారు.