Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ పరిరక్షణ పేరుతో అధికారపార్టీ ఆరాటం
- పోడుదారులను మభ్యపెట్టేలా ప్రణాళికలు
- అటవీశాఖ చేతికి అధికారం ఇచ్చేందుకు సన్నాహాలు
- గిరిజనశాఖ నోడల్ ఏజెన్సీ కమిటీల కోసం విపక్షాల డిమాండ్
- రేపటి నుంచి నెలరోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పోడుదారులకు హక్కు పత్రాలు ఇచ్చే విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు స్పష్టమైన విధివిధానాలను వెల్లడించకుండానే ప్రభుత్వం ఇష్టారీతిలో ముందుకెళ్తోంది. 'అడవి నాదే...ఆట నాదే' అనే తీరుగా ప్రభుత్వ వ్యవహారశైలి ఉందనే విమర్శలు వస్తున్నాయి. రోజుకోరీతిలో మార్గదర్శకాలను ప్రకటిస్తూ పోడుదారులను మభ్యపెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తొలుత ఎమ్మెల్యేల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గినా.. ప్రస్తుతం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒకవేళ ఇదే జరిగితే గులాబీ గుప్పిట్లో ఉన్న గ్రామ సర్పంచ్లు ఏ మేరకు పోడుదారులకు న్యాయం చేస్తారనేది ప్రశ్నార్థకమేనని ప్రతిపక్షాలు అంటున్నాయి. అందుకే గిరిజనశాఖ ద్వారా నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈనెల 8 నుంచి వచ్చేనెల 8వ తేదీ వరకు నెలరోజుల పాటు దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించారు. దరఖాస్తుల స్వీకరణకు కనీసం మూడునెలల సమయం కేటాయించాలని విపక్షాలు కోరుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పోడుదారుల లెక్కలను సైతం అశాస్త్రీయంగా చేశారు. శాటిలైట్ చిత్రాల ద్వారా పోడుభూములను లెక్కించారు. దీనివల్ల వేలాది ఎకరాల పోడుభూములను వందలుగా నిర్ధారించారు. గతంలో 96,679 మంది పోడు రైతులకు 3,08,614 ఎకరాల భూమిని ఆర్వోఎఫ్ఆర్ పట్టాల ద్వారా అప్పగించారు. ఇప్పుడు 7,23,629 ఎకరాల అటవీభూమిని 1,99,354 మంది పోడుదారులు సాగు చేస్తున్నట్టు శాటిలైట్ సర్వే ద్వారా అంచనా వేశారు. ఖమ్మం జిల్లాలోని పది మండలాలు 95 గ్రామపంచాయతీల్లో అటవీభూముల ఆక్రమణలున్నాయి. జిల్లాలో 10.77 లక్షల ఎకరాలు (14.66%) అటవీభూములున్నట్టు నివేదిక రూపొందించారు. 17,449ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు తేల్చారు. 17,861ఎకరాలకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చినట్టు నిర్ధారించారు.జిల్లాలో అత్యధికంగా 4,673 ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయి. అత్యల్పంగా వేంసూరులో 31.75ఎకరాల్లో పోడు ఉన్నట్టు గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10.13 లక్షల ఎకరాల (58%) అటవీభూమి విస్తీర్ణం ఉంది. జిల్లాలోని 21మండలాల్లోని 343 గ్రామపంచాయతీల్లో 2,29,229 ఎకరాలు పోడుదారుల చేతిలో ఉన్నాయని నివేదికలో పొందుపరిచారు. గుండాల, టేకులపల్లి, ఇల్లెందు, ములకలపల్లి, ఆళ్లపల్లి, అశ్వారావుపేట, దుమ్ముగూడెం మండలాల్లోనే 63% భూములు పోడుదారుల చేతిలో ఉన్నాయి. గతంలో 96,709 మందికి పట్టాలిచ్చారు. ఉమ్మడి జిల్లాల గిరిజనేతర పోడురైతుల చేతిలో 44 శాతం భూములున్నాయి. ఖమ్మంలో 4,599 మంది గిరిజనులు, 9,764 (56%) ఎకరాల పోడు సేద్యం చేస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో 46,212 మంది గిరిజనులు 1,29,229 ఎకరాల అటవీ భూమి సాగు చేసుకుంటున్నారు. 29,069 మంది గిరిజనేతరులు లక్ష ఎకరాల్లో సేద్యం చేస్తున్నారు. కొందరు బినామీ పేర్లతో సాగు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
కమిటీల నిర్మాణంలో అధికారపార్టీదే హవా..
కమిటీల నిర్మాణంలో అధికారపార్టీ హవా కొనసాగించే పరిస్థితులే కనిపిస్తున్నాయి. గ్రామసభ నిర్వహించి అటవీహక్కుల కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అటవీప్రాంతం ఉన్న ప్రతి గ్రామంలో గ్రామ సభతో పాటు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో అటవీహక్కుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కమిటీల్లో ఎస్టీలు, మహిళా ప్రజాప్రతినిధులకు చోటు కల్పిస్తున్నారు. ఆపై మండల, డివిజన్, జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఖమ్మం జిల్లాలో 125 కమిటీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కమిటీల్లో ఆయా శాఖల నుంచి 112 మంది అధికారులకు చోటు కల్పించనున్నారు. ఈ కమిటీల ఏర్పాటులో అటవీశాఖ జోక్యం అత్యధికంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. పైగా సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు అధికారపార్టీకి చెందిన వారికే అత్యధికంగా కమిటీల్లో చోటు దక్కే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో పోడుదారులకు ఏమేరకు న్యాయం జరుగుతుందనే విషయంలో సందేహాలు నెలకొన్నాయి.
అధికారపార్టీ నేతల కబ్జాలో అత్యధిక అటవీభూములు, సంపద
అత్యధిక అటవీ భూములు అధికారపార్టీ నేతల కబ్జాలో ఉన్నా.. చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వం అటవీ పరిరక్షణే ధ్యేయంగా ప్రణాళికలు రూపొందించడం విమర్శలకు తావిస్తోంది. దండకారణ్యం లో ఉన్న విలువైన అటవీ సంపదను అధికారపార్టీ నేతలు అడ్డగోలుగా తరలించుకు వెళ్తున్నా పట్టని అటవీశాఖ పోడుభూములపై దాడుల విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పాల్వంచ సమీపంలోని ఓ గుట్టలో రూ.కోట్ల విలువ చేసే మట్టిని అధికారపార్టీకి చెందిన ఓ నేత యథేచ్ఛగా తరలిస్తున్నా రు. స్వయంగా మంత్రి పువ్వాడ అజరుకుమార్ ఇలాకాలోని రఘునాథపాలెం మండలంలోని కుక్కలగుట్ట మట్టిని కూడా ఇలాగే తరలించి, అధికార పార్టీకి చెందిన నేతలు ఆ భూమిలో పాగా వేశారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో అధికార పార్టీ అండతో వందల ఎకరాల్లో బినామీలు విచ్చలవిడిగా పోడు వ్యవసాయం చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి.
నోటిఫికేషన్ లేకుండా దరఖాస్తులు ఎలా?
ఇప్పటి వరకు 8వ తేదీ నుంచి దరఖాస్తులు తీసుకుంటారనే ప్రకటన వచ్చింది తప్ప నోటిఫికేషన్ రాలేదు. ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. ఎఫ్ఆర్సీ కమిటీలు లేని చోట దరఖాస్తులు ఎవరికి ఇవ్వాలి? అందుకే రాష్ట్రస్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేయాలి. రాష్ట్రస్థాయిలో కాకుండా జిల్లాస్థాయిలో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అదికూడా జరిగినట్టు లేదు. శాటిలైట్ ఆధారంగా పోడుభూములు లెక్కించారు. అత్యంత అశాస్త్రీయంగా, చట్టవిరుద్ధంగా ఈ వ్యవహారం నడుస్తోంది. ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా పోడుభూముల పట్టాల ప్రక్రియను చేపట్టింది.
- మిడియం బాబూరావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు