Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థుల నుంచి వేల రూపాయలు వసూలు
- చట్టవిరుద్ధంగా నాగార్జున విశ్వవిద్యాలయం స్టడీ సెంటర్లు
- ఓయూ పరిధిలోని పలు డిగ్రీ కాలేజీల్లో పరీక్షలు
- పట్టించుకోని ఉన్నత విద్యామండలి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఏపీకి చెందిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం స్టడీసెంటర్లు రాష్ట్రంలో యధేచ్చగా నడుస్తున్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాల్లోని రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ టు బి యూనివర్సిటీలు, ప్రయివేటు విశ్వ విద్యాలయాలకు చెందిన స్టడీ సెంటర్లు తెలంగాణ రాష్ట్రంలో నడిపేందుకు అనుమతి లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2014, జూన్ 2న ఏపీ, తెలంగాణగా విడిపోయింది. దీంతో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రానికి చెందిన స్టడీ సెంటర్లు ఏపీకే పరిమితం కావాలి. కానీ తెలంగాణలో వాటిని చట్టవిరుద్ధంగా పలు డిగ్రీ, పీజీ కాలేజీల్లో నడిపించడం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల నుంచి వేల రూపాయల ఫీజును వసూలు చేసి అడ్డగోలు దందాకు పాల్పడుతున్నాయి. కోట్ల రూపాయల విద్యావ్యాపారం చేస్తున్నాయి. శనివారం నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) పరిధిలోని పలు డిగ్రీ కాలేజీల్లో నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రానికి చెందిన పరీక్షలు ప్రారంభం కావడం విశేషం. తెలంగాణకు చెందిన విద్యార్థులే ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రానికి చెందిన విశ్వవిద్యాలయం స్టడీ సెంటర్లకు సంబంధించి తెలంగాణలో పరీక్షలు రాసి ఉత్తీర్ణత పొందినా ఆ సర్టిఫికెట్లు ఇక్కడ చెల్లుబాటు కావు. ఉన్నత విద్యకు వెళ్లాలన్నా, ఉద్యోగం పొందాలన్నా ఆ సర్టిఫికెట్లు పనికిరావని ఉన్నత విద్యామండలి గతంలోనే పలుమార్లు ప్రకటించింది. నాగార్జున విశ్వవిద్యాలయానికి లేఖలు సైతం రాసింది. దీంతో నాగార్జున విశ్వవిద్యాలయం తెలంగాణలో పరీక్షలు స్టడీ సెంటర్లు నిర్వహించి పరీక్షలు రాయిస్తున్నా ఏపీలో చదివినట్టుగానే సర్టిఫికెట్లు జారీ చేస్తుండడం గమనార్హం. విద్యార్థులు స్టడీ సెంటర్లు లేదా ఇంటి నుంచే జవాబుపత్రాలు రాసి నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రానికి పంపిస్తారు. వారికి ఏపీలో పరీక్షలు రాసి నట్టుగా పరిగణించి ఆ వర్సిటీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నది. అందుకే ఆ వర్సిటీకి చెందిన స్టడీ సెంటర్లు రాష్ట్రంలో యధేచ్చగా నడుస్తున్నాయి. దీని వల్ల తెలంగాణ విద్యార్థులే నష్టపోయే ప్రమాదమున్నది. అయినా ఉన్నత విద్యామండలి, ఓయూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ఆధారాలతో సహా అధికారులకు ఇచ్చినా ఎలాంటి చర్యలూ తీసుకోవవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆదేశాలు కాగితాలకే పరిమితం
ఇతర రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ టు బీ వర్సిటీలు, ప్రయివేటు యూనివర్సిటీలకు చెందిన స్టడీ సెంటర్లు, పరీక్షలు తెలంగాణలో నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామనీ, రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తామనీ, అవసరమైతే స్టడీ సెంటర్లు నడిపే అనుబంధ కాలేజీ గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం 2020, ఫిబ్రవరి 28న ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆ ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయి. నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రానికి చెందిన స్టడీ సెంటర్లు పలు డిగ్రీ కాలేజీల్లో కొనసాగుతున్నాయి. శనివారం నుంచి ఈనెల 13 వరకు ఘట్కేసర్, అమీర్పేట్, కూకట్పల్లి, మెహిదీపట్నం, ఈసీఐఎల్, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం, నారాయణగూడ, కీసర ప్రాంతాల్లోని పలు డిగ్రీ కాలేజీల్లో ఎంబీఏ పరీక్షలు జరుగుతున్నాయి. అయినా చర్యలు తీసుకోకపోవడంతో ఉన్నత విద్యామండలి, ఓయూకు చెందిన అధికారులపై పలు అనామానాలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా వ్యవసాయ స్టడీ సెంటర్లు నడుస్తున్నాయని ఉన్నత విద్యామండలి గుర్తించింది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపుతో తెలంగాణలో స్టడీ కేంద్రం నెలకొల్పి విద్యార్థులను ఆకర్షించి లక్షలాది రూపాయలను ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నట్టు దృష్టికి వచ్చింది. దీంతో మండలి ఆ స్టడీ సెంటర్లకు నోటీసులు జారీ చేసింది. అయినా అవి అలాగే కొనసాగుతుండడం గమనార్హం.
కఠిన చర్యలు తీసుకోవాలి : ఎం ప్రేమ్కుమార్, రీసెర్చ్ స్కాలర్, ఓయూ
చట్టవిరుద్ధంగా నడుస్తున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం స్టడీ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. దీనిపై ఓయూ రిజిస్ట్రార్, ఆడిట్ సెల్ డైరెక్టర్, డీజీపీకి ఫిర్యాదు చేశాం. ఇక్కడి విద్యార్థులను మోసం చేస్తూ వాటిని నడిపించడం సమంజసం కాదు. ఇప్పుడు పరీక్షలు జరుగుతున్న స్టడీ సెంటర్లపై తనిఖీలు చేపట్టాలి. ఆయా కాలేజీల గుర్తింపు రద్దు చేయాలి.